కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లోని సంక్షేమ గురుకుల బాలికల స్కూల్ లో దొంగతనం నేరం మోపుతూ 8వ తరగతికి చెందిన నలుగురు విద్యార్థులను చితకబాదిన ఘటనపై సోమవారం సంబంధిత ఆఫీసర్లు ఎంక్వయిరీ చేపట్టారు. కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలతో జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్ కె.మహేశ్వర్రావు, జిల్లా కోఆర్డినేటర్ రామకల్యాణి, ఇన్చార్జ్ జోనల్ ఆఫీసర్ గిరిజ, పట్టణ ఇన్చార్జ్ ఎస్సై
శ్రీనివాస్ సోమవారం స్కూల్ను సందర్శించారు. స్కూల్లో పనిచేసే హిందీ టీచర్ బంగారు నగ శనివారం కనిపించకపోవడంతో నలుగురు విద్యార్థులను అనుమానించారు. దీంతో పీఈటీ టీచర్ వారిని కర్రతో చితకబాదారు. కాగా కొద్దిసేపటికే నగ కాంపౌండ్ వాల్వద్ద దొరికింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆఫీసర్లు విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థులు, ఘటనకు కారణమైన టీచర్లను తల్లిదండ్రుల సమక్షంలోనే ప్రశ్నించారు. టీచర్లతో పాటు ప్రిన్సిపాల్ప్రేమలత ఈ ఘటనను గోప్యంగా ఉంచడంపై ఎంక్వయిరీ ఆఫీసర్లు అగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎంక్వయిరీ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని మీడియాకు తెలిపారు.
చర్యలు తీసుకోవాలి
హిందీ టీచర్, పీఈటీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, టౌన్ సెక్రటరీ మిట్టపల్లి శ్రీనివాస్, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. స్కూల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
