- సర్పంచ్ పదవికి కోటిన్నర వరకు ఖర్చుకు అభ్యర్థులు రెడీ
మెదక్/మనోహరాబాద్/చిన్నశంకరంపేట, వెలుగు: మెదక్ జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియాలోని పలు గ్రామ పంచాయతీల్లో అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా కాస్ట్ లీ పోరు జరగనుంది. ఆయా చోట్ల వివిధ రూపాల్లో ఇన్ కమ్ సోర్స్ ఎక్కువగా ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి రూ.25 లక్షలు మొదలు కొని రూ.కోటిన్నర వరకు ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
జిల్లాలోని నేషనల్ హైవే 44 వెంట ఉన్న మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో చిన్నా, పెద్దా కలిపి దాదాపు 350 పరిశ్రమలు ఉన్నాయి. అందులో స్టీల్, ఫార్మా, ఫుడ్ గ్రేయిన్, కోళ్ల దాణా తయారీకి సంబంధించి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల ద్వారా ట్యాక్స్ల రూపంలో పంచాయతీలకు ఏటా లక్షల్లో ఆదాయం సమకూరుతుంది.
లేబర్ కాంట్రాక్ట్ల ద్వారా, వెహికల్స్ సమకూర్చడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం లభించనుంది. పరిశ్రమల విస్తరణ, కొత్త పరిశ్రమల ఏర్పాటు సమయంలో పంచాయతీ పర్మిషన్ అవసరం ఉంటుంది కాబట్టి కంపెనీ యాజమాన్యాల నుంచి భారీ మొత్తంలో నజరానాలు అందే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సంఖ్యలో, భారీ పరిశ్రమలు ఉన్న పంచాయతీ సర్పంచ్ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. మనోహరాబాద్ మండలంలో కాళ్లకల్, కొండాపూర్, కూచారం, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల పరిధిలో భారీ పరిశ్రమలు ఉన్నాయి.
ఇదే మండల పరిధి పర్కిబండ శివారులో మల్టీ మోడల్లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు కానుంది. ఇక్కడ 350 ఎకరాల్లో వివిధ రకాల పరిశ్రమలు వెలియనున్నాయి. దీంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందనుంది. మనోహరాబాద్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో అనేక ఫామ్హౌజ్లు, రిసార్ట్ లు వెలిశాయి. మరికొన్ని రిసార్ట్ లు ఏర్పాటు కానున్నాయి.
వాటి పర్మిషన్ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఇండస్ట్రియల్ ప్రాంతమైన కాళ్లకల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేయనున్న అభ్యర్థులు కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. కొండాపూర్ చిన్న గ్రామపంచాయతీ అయినా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో ఇక్కడ సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు సైతం రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఎంతయినా ఖర్చు పెడతాం..
మరో ఇండస్ట్రియల్ ఏరియా గ్రామాలైన కూచారం సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు, ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్ పదవి ఎస్సీలకు రిజర్వ్ కావడంతో అక్కడ ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవడం కోసం వార్డు మెంబర్ స్థానాలకు పోటీ చేసే పలువురు అభ్యర్థులు ఇప్పటి నుంచే లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. మండల కేంద్రమైన చిన్నశంకరంపేట, రుద్రారం గ్రామ పంచాయతీల పరిధిలో పలు భారీ స్టీల్పరిశ్రమలు ఉండడంతో పాటు, మరిన్ని కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
దీంతో చిన్నశంకరంపేట సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న ఓ అభ్యర్థి ఈ పాటికే లక్షల్లో ఖర్చు పెట్టగా, ఎలాగైనా సర్పంచ్గా గెలవాలన్న టార్గెట్ తో కోటిన్నర వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రుద్రారం గ్రామంలో ఓకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటా పోటీగా రూ.50 లక్షలకు వరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. తూప్రాన్, చేగుంట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల పరిధిలో పరిశ్రమలు ఉన్న పంచాయతీ సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఎన్నికల్లో గెలిచేందుకు రూ.20 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
