
గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు చేపట్టింది ఇంటర్ బోర్డు. అలాంటి కాలేజీలను గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలతో ప్రైవేటు కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్లు ప్రకటించారు. ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమై సమీక్షించారు. సమావేశంలో ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నోటీసులు అందుకున్న 79 కాలేజీలు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని బోర్డు అధికారులు తెలిపారు. ఆయా కాలేజీల నుంచి ఎలాంటి స్పందన రాకపోతే వాటిని మూసివేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ హెచ్చరించారు. గుర్తింపు లేని కాలేజీలపై ఈ నెల 25 తేదీ లోపు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని… దీన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ఆదేశాల అమలుకు సహకరించాలని స్పష్టం చేశారు.