యూట్యూబ్​లో ఇంటర్​ పాఠాలు

యూట్యూబ్​లో ఇంటర్​ పాఠాలు

పరీక్షల నేపథ్యంలో స్టూడెంట్ల డౌట్లు తీర్చేందుకు చానెల్​

హైదరాబాద్​, వెలుగు: ఇంటర్​ పరీక్షలు దగ్గరపడుతున్నాయి. స్టూడెంట్లకు చదువుతున్న పాఠాలపై డౌట్లు రావడం కామన్​. కాలేజీలో అయితే ఓకేగానీ, ఇంట్లో చదివేటప్పుడు డౌట్లు వస్తే ఎలా? డౌట్​ వచ్చిన ప్రతిసారీ లెక్చరర్​ దగ్గరకు వెళ్లలేరు కదా. అందుకే లెక్చరర్​ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ డౌట్​లు తీర్చుకునేందుకు ఓ యూట్యూబ్​ చానెల్​ను తీసుకురాబోతోంది సర్కార్​. ‘తెలంగాణ ఇంటర్మీడియట్​’ పేరిట చానెల్​ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే స్టూడెంట్ల కోసం ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్నీ ఏర్పాటు చేసిన ఇంటర్​ బోర్డు, ఇప్పుడు ఈ చానెల్​ను స్టూడెంట్స్​ కోసం అందుబాటులోకి తీసుకురాబోతోంది. మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్​ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రమంతటా ఫస్టియర్​, సెకండియర్​ కలిసి 9,65,840 మంది పరీక్షలు రాయనున్నారు. 1,339 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు.

సీనియర్లతో పాఠాలు.. వీడియోలు రెడీ

స్టూడెంట్స్​ను పరీక్షలకు మానసికంగా సిద్ధం చేసేందుకు ఇప్పటికే ఇంటర్​ బోర్డు కౌన్సిలర్లను నియమించింది. దాంతో పాటు పాఠాల్లో డౌట్లను తీర్చేందుకు సీనియర్​ ఎక్స్​పర్ట్​లతో వివిధ సబ్జెక్టులపై పాఠాలు చెప్పించి వీడియోలు రెడీ చేసింది. ఆ వీడియోలను యూట్యూబ్​ చానెల్​లో అప్​లోడ్​ చేస్తారు. అయితే, ఆ చానెల్​ ఈపాటికే మొదలు కావాల్సి ఉన్నా, సర్కారు అనుమతి కోసం అధికారులు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. విద్యాశాఖకు గతంలో ఉన్న కార్యదర్శి హయాంలో యూట్యూబ్​ చానెల్​ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆయన బదిలీపై వెళ్లారు. దీంతో ఇప్పుడు కొత్త కార్యదర్శి అనుమతి కోసం మరోసారి ఇంటర్​బోర్డు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కాగా, యూట్యూబ్​ చానెల్​ ప్రారంభమైతే కొన్ని సబ్జెక్టుల్లో డల్​గా ఉండే స్టూడెంట్లకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. స్టూడెంట్స్​, పేరెంట్స్​​నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు, వారి డౌట్లు తీర్చేందుకు ఇంటర్​ బోర్డు ప్రత్యేకంగా ఓ కంట్రోల్​ రూమ్​ను ఏర్పాటు చేసింది. పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం 040 – 24601010/ 24732369 నెంబర్లకు ఫోన్​ చేయొచ్చని ప్రకటించింది.

తప్పులతో బుక్లెట్.. మెసేజ్తో రిజల్ట్స్

పోయినేడాది ఇంటర్​ ఆన్సర్​ షీట్లు దిద్దడంలో ఎన్నో తప్పులు దొర్లాయి. ఈసారి ఆ తప్పులేవీ జరగకుండా, ఆ తప్పులను ఒక దగ్గర చేర్చి ప్రత్యేకంగా ఓ బుక్​లెట్​ను తయారు చేశారు. దానిని ఎగ్జామ్స్​ డ్యూటీ పడిన వాళ్లందరికీ ఇవ్వనున్నారు. వారికి స్పెషల్​ ట్రైనింగ్​ కూడా ఇవ్వనున్నారు. దాని వల్ల తప్పులు కొంతమేరైనా తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పరీక్ష ఫలితాలను నేరుగా స్టూడెంట్ల ఫోన్లకు నేరుగా పంపించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఫలితాల కోసం చాలా మంది స్టూడెంట్లు ఇంటర్నెట్​ సెంటర్ల దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే హాల్​టికెట్​ నంబర్​ను మెసేజ్​ చేస్తే, ఫోన్​కే రిజల్ట్​ పంపించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.