ఉద్యోగులకు 50% ఫిట్ మెంట్ ఇవ్వాలె : మధుసూధన్ రెడ్డి

ఉద్యోగులకు 50%  ఫిట్ మెంట్ ఇవ్వాలె : మధుసూధన్ రెడ్డి
  • పీఆర్సీ కమిటీకి  ఇంటర్ విద్యా జేఏసీ వినతి

హైదరాబాద్, వెలుగు: పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఉద్యోగుల వేతన సవరణ చేయాలని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి కోరారు. ఉద్యోగులందరికీ 50% ఫిట్ మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్​కే భవన్​లో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం నేతలు, ఇంటర్ విద్యాజేఏసీ నేతలు రెండో పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ ను కలిశారు. ఈ సందర్భంగా సర్కారు జూనియర్ లెక్చరర్, ప్రిన్సిపాల్స్, ఇతర ఉన్నతాధికారుల వేతన సవరణకు సంబంధించిన సమగ్ర నివేదికను పీఆర్సీ కమిటీకి అందించారు. 

 మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారికి 15% హెచ్​ఆర్ఏ, మున్సిపాలిటీల్లో 18%, జిల్లా హెడ్ క్వార్టర్లలో పనిచేసే వారికి 20%, జీహెచ్​ఎంసీ పరిధిలోని వారికి 27% హెచ్​ఆర్ఏ ఇవ్వాలని కోరారు. ఇంటర్ ఎడ్యుకేషన్ లో పనిచేసే జూనియర్ లెక్చరర్ల పేరును.. లెక్చరర్​గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులను సెంట్రల్ గవర్నమెంట్ మాదిరిగా 90 రోజుల నుంచి 730 రోజులకు పెంచాలని రిక్వెస్ట్ చేశారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యాజేఏసీ నేతలు కృష్ణకుమార్,  కేఎస్ రామారావు, రవీందర్ రెడ్డి, రామానుజాచార్యులు పాల్గొన్నారు.