
- మూడేళ్లలో ఇదే అత్యధికం
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ 2023-–24కి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించింది. గత మూడేళ్లలో ఇదే అత్యధికమని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. ఈ సంస్థ 2021-–22లో పీఎఫ్ పెట్టుబడులపై వడ్డీరేటును 8.10 శాతం నుంచి 2022–-23లో స్వల్పంగా 8.15 శాతానికి పెంచింది. ఈపీఎఫ్ఓ తన ఆరు కోట్ల మంది సబ్స్క్రయిబర్ల కోసం 2020-–21లో 8.5 శాతం ఉన్న వడ్డీని 2021–-22లో నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1 శాతానికి తగ్గించింది.
ఈపీఎఫ్ వడ్డీ రేటు అతితక్కువగా 1977–-78లో ఎనిమిది శాతం ఉంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన శనివారం జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 235వ సమావేశంలో 2023–-24కి వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ వడ్డీ రేటు ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వ గెజిట్లో అధికారికంగా పేర్కొంటారు. తదనంతరం, ఈపీఎఫ్ఓ ఆమోదించిన వడ్డీ రేటు ప్రకారం మెంబర్ల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తారు.
2024 ఆర్థిక సంవత్సరం కోసం మెంబర్లకు రూ.1.07 లక్షల కోట్లను చెల్లించాలని ఈపీఎఫ్ రికమెండ్ చేసింది. ప్రిన్సిపల్ మొత్తం రూ.13 లక్షల కోట్లు. 2022–23లో ఇది రూ. 11.02 లక్షల కోట్లు ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే భారీ వృద్ధి నమోదైందని, ఆదాయం 17.39 శాతానికి పైగా పెరిగిందని ఈపీఎఫ్ఓ తెలిపింది. అసలు మొత్తం 17.97 శాతం పెరిగిందని పేర్కొంది. ఇతర పెట్టుబడి మార్గాలతో పోలిస్తే ఈపీఎఫ్ఓ అందించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
మార్చి 2020లో, ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2018–-19కి అందించిన 8.65 శాతం నుంచి 2019–-20కి ఏడేళ్ల కనిష్ట స్థాయి 8.5 శాతానికి తగ్గించింది. 2016–-17లో 8.65 శాతం, 2017–-18లో 8.55 శాతం వడ్డీ రేటును చెల్లించింది. 2015–-16లో వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా 8.8 శాతంగా ఉంది. 2013–-14 , 2014–-15లో 8.75 శాతం వడ్డీని ఇచ్చింది.