- రీ వెరిఫికేషన్ సెంటర్లకు క్యూ కడుతున్న స్టూడెంట్స్
- ఫెయిలైన విద్యార్థులు దరఖాస్తు చేయనక్కర్లేదు
- తక్కువ మార్కులు వచ్చిన వారు మాత్రం ఫీజు కట్టాలి
- 12 రోజుల్లో రీ వెరిఫికేషన్..15 రోజుల్లో మెమోలు
ఇంటర్మీడియట్ ఫలితాలు సృష్టించిన గందరగోళ పరిస్థితులు సద్దమణగడం లేదు. ఇటు ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో నూ అటు పేరెంట్స్ లోనూ అయోమయ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇంటర్ ఫలితాల అనంతరం నెలకొన్నపరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేష-న్, రీ కౌంటింగ్ చేపట్టాలని ఆదేశించారు. దీనిని పర్యవేక్షించేందుకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఫెయిలైన విద్యార్థులు రీ వెరిఫికేషన్ కోసం ఎటువంటి దరఖాస్తులు సమర్పించక్కర్లేదని ఇంటర్ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఫీజు చెల్లించిన వారికి రిఫండ్ చేయనున్నట్లు ఇంటర్ అధికారులు స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ ప్రక్రియను 12 రోజుల్లోగా పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుం ది. మరో 15 రోజుల్లో విద్యార్థులకు మెమోలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలోమూల్యాంకనం చేసిన అధ్యాపకులతోనే రీ వెరిఫికేషన్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అనుమానాలను నివృత్తి చేసిన అధికారులు
తరలివచ్చిన మూడు వేల మంది
ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు ఎటువంటి ఫీజు, దరఖాస్తులు సమర్పించే అవసరం లేదు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మాత్రం గతంలో బోర్డు నిబంధనల ప్రకారం రీ వెరిఫికేషన్కు రూ.600, రీకౌంటింగ్ కు రూ.100 చెల్లిం చాల్సి ఉంటుంది.ఆందోళనలో ఉన్న విద్యార్థులు వారి పేరెంట్స్ అవగాహన కోసం నగరంలో ఎనిమిది రీ వెరిఫికేషన్ సెంటర్లను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది.హైదరాబాద్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం గురువారం విద్యార్థులు వారి పేరెంట్స్ తో కిక్కిరిసి పోయింది. దాదాపు 3 వేల మంది విద్యార్థులు, వారి పేరెంట్స్ వచ్చి తమ సందేహాలను ఇంటర్ అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. హైదరాబాద్ డీఐఈఓ కార్యాలయం అధికారులు సావధానంగా ఆందోళనలో వచ్చిన వారికి తగిన విధంగా సముదాయించి వారి సందేహాలను నివృత్తి చేశారు.
4 సెంటర్లలో 70 అప్లికేషన్లు
నగరంలో ఈ–సేవ సెంటర్లు దరఖాస్తులు తీసుకోవడం లేదని వాపోతూ విద్యార్థులు హైదరాబాద్ డీఐఈఓ కార్యాలయానికి వచ్చారు . ఇంటర్ బోర్డు వెబ్ సైట్ ఓపెన్ కావడం లేదని కూడా చాలా మంది పేరెంట్స్ డీఐఈఓ కార్యాలయం ముందు క్యూ కట్టారు . ఫెయిలైన విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తులు సమర్పించే అవసరం లేదని,కేవలం తక్కువ మార్కులు వచ్చాయనుకుంటున్నవిద్యార్థులు మాత్రమే పాత నిబంధనల మేరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని ఇంటర్ బోర్డు అధికారులు వచ్చిన వారికి స్పష్టం చేశారు.ఆలాగే ఫెయిలైన విద్యార్థుల నుంచి అప్పటికప్పుడు దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేశారు. ఇలా జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో దాదాపుగా 60–70దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 8 నుంచి కార్యాలయానికి విద్యార్థులు వారి పేరెంట్స్ తాకిడి మొదలయింది. సాయంత్రం 7 దాటినా బాధిత స్టూడెంట్స్ వస్తూనే ఉన్నట్లు కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు. హైదరాబాద్ డీఐఈఓ జయప్రద బాయి, ఆఫీస్ సిబ్బంది వచ్చిన వారికి వచ్చినట్లు వారి సందేహాలను నివృత్తి చేసి పంపుతున్నారు. మహబూబియా కాలేజీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు, ఎటువంటి అవాం ఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.మరో రెండు రోజులు ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశమున్నట్లు ఇంటర్ అధికారులు పేర్కొంటున్నారు.