- దుబాయ్లోని అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న అధికారులు
- ఢిల్లీలో రూ.2,500 కోట్ల కొకైన్ సీజ్ కేసులో కీలక పరిణామం
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ మాస్టర్మైండ్ పవన్ ఠాకూర్ను దుబాయ్ అధికారులు అరెస్ట్ చేశారు. త్వరలో అతడిని భారత్కు రప్పించేందుకు భారత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు చర్యలు చేపట్టారు. గతేడాది నవంబర్లో ఢిల్లీలో 82 కిలోల అత్యంత నాణ్యమైన కొకైన్ ను ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది.
దాని విలువ రూ.2,500 కోట్లుగా అంచనా వేసింది. ఈ కేసులో అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో ఈ రాకెట్కు పవన్ ఠాకూరే మాస్టర్మైండ్ అని గుర్తించారు. ఢిల్లీలో 82 కిలోల డ్రగ్స్ పట్టుబడడం, తన ఐదుగురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఠాకూర్ తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్కు పారిపోయాడు.
అక్కడ ఖరీదైన ‘దుబాయ్ హిల్స్ ఎస్టేట్’లో ఒక విల్లా సహా అనేక ఆస్తులు, లగ్జరీ కార్లు కొనుక్కున్నాడు. ఇక దుబాయ్ నుంచే తన స్మగ్లింగ్, మనీ లాండరింగ్ నెట్వర్క్ను నడపడం స్టార్ట్ చేశాడు. ఇటీవల ఢిల్లీలోనే రూ.282 కోట్ల విలువైన మెథాంఫెటమిన్(మెథ్) డ్రగ్స్ కేసులోనూ పవన్ ఠాకూర్ పాత్ర బయటపడింది.
దాంతో అతనిపై అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవడానికి ఎన్సీబీ సెప్టెంబర్లో ఇంటర్నేషనల్ సిల్వర్ నోటీస్ జారీ చేసింది. ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు కూడా అతనిపై నాన్-బెయిలబుల్ వారంట్ ఇష్యూ చేసింది. ఈ క్రమంలోనే ఎన్సీబీ, ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా దుబాయ్ సీఐడీ, ఇంటర్పోల్ అధికారులు మంగళవారం ఉదయం పవన్ను అరెస్ట్ చేశారు.
