- 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్, హాట్ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ షోలను నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సెక్రటేరియెట్లో బుధవారం టూరిజం ఎండీ వల్లూరి క్రాంతి, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, క్లిక్ ప్రతినిధులతో కలిసి మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ‘సెలబ్రేట్ ది స్కై’ పేరుతో సంక్రాంతి సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నాం.
13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినం. 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, మన దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 55 నేషనల్ కైట్ ఫ్లయర్స్ హాజరువుతున్నారు. తమ ఇండ్లల్లో తయారు చేసిన 1,200 రకాల మిఠాయిలు, తెలంగాణ పిండి వంటలను 60 స్టాల్స్లో అందుబాటులో ఉంచుతున్నం. 100 చేనేత, హస్తకళల స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నం. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎంట్రీ ఫ్రీ. అందరూ ఆహ్వానితులే’’అని మంత్రి జూపల్లి ప్రకటించారు.
యూరప్ నుంచి ప్రతినిధుల బృందం
16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని జూపల్లి తెలిపారు. ‘‘యూరప్ దేశాల ప్రతినిధులతో అంతర్జాతీయ స్థాయిలో బెలూన్ల ప్రదర్శన ఉంటుంది. ఈ బెలూన్ లో విహరించాలనుకునే వాళ్లు బుక్ మై షో లాంటి ఆన్లైన్ ప్లాట్ఫాంలో టికెట్ బుక్ చేసుకోవాలి. 16 నుంచి 17 వరకు గచ్చిబౌలి స్టేడియంలో అత్యాధునిక డ్రోన్లతో మెగా షో ఉంటుంది.
చెరువుల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించిన బాగ్ అంబర్ పేటలోని బతుకమ్మకుంట, కూకట్ పల్లిలోని నల్లచెరువు, మాదాపూర్ లోని తమ్మిడికుంట, రాజేంద్రనగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీ సమీపంలోని బమ్రుకున్ ఉద్ దౌలా చెరువుల వద్ద పతంగుల పండుగ నిర్వహిస్తాం’’అని జూపల్లి తెలిపారు.
