- ఆరు తులాల బంగారం, వెండి, కార్లు స్వాధీనం
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: కార్లు రెంట్కు తీసుకుని రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇండ్లలో దోపిడీలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో నిందితులను మీడియాకు చూపించారు. భూత్పూర్–హైదరాబాద్ హైవే తోపాటు సంగారెడ్డి, ముంబై, పుణె వైపు రూట్లోని ఇండ్లల్లో దోపిడీలకు పాల్పడే ఈ ముఠాకు హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన మహమ్మద్ సోహెల్ ఖురేషి లీడర్గా ఉన్నాడు. ఇతడిపై 21 దొంగతనం కేసులున్నాయి. ఇతడు మహ్మద్ అబ్రారూద్దీన్, సలీం బిన్ అలీ, మహ్మద్ సోహైల్, షేక్ ఇస్మాయిల్ లతో టీం ఏర్పాటు చేసుకుని దొంగతనాలు చేస్తున్నాడు. అబ్రారూద్దీన్, సలీం బిన్ అలీ, మహ్మద్సోహైల్ ఈ మధ్యే పీడీ యాక్ట్పై జైలుకు వెళ్లి వచ్చారు. ఖురేషి కూడా వేరే కేసులో జైలు నుంచి బయటకు వచ్చాడు. వీరంతా గత నెల 23న రాజాపూర్, బాలానగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో రెండు దొంగతనాలు చేశారు. తర్వాత భూత్పూర్ మండలం పోతులమడుగులో పెట్రోల్పంప్లో రూ.3500 పెట్రోల్ పోయించుకుని డబ్బులివ్వకుండా పారిపోయారు. దీంతో వారు పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. విచారణలో ఆ రెండు చోట్ల చోరీలు చేసింది వీరేనని తేలింది. నిఘా పెట్టి బుధవారం జడ్చర్ల నేతాజీనగర్లోని ఓ ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులు హైదరాబాద్ కు చెందిన వారు కాగా, షేక్ ఇస్మాయిల్ బీదర్ కు చెందినవాడు. వీరి నుంచి 6 తులాల బంగారం, ఐదున్నర తులాల వెండి, రెండు కార్లు, రెండు బైక్ లు, కంప్యూటర్, టీవీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మళ్లీ పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ చెప్పారు. రాజాపూర్,భూత్పూర్, మిడ్జిల్, పాలమూరు రూరల్ పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేశారు. అడిషనల్ ఎస్పీ రాం కుమార్ , డీఎస్పీ కిషన్, జడ్చర్ల రూరల్ ఇన్స్పెక్టర్జములప్ప పాల్గొన్నారు.