హైదరాబాద్, వెలుగు: ప్రీమియం మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ ‘స్కూటర్’ హైదరాబాద్ మార్కెట్లో అడుగుపెట్టింది. హైటెక్ సిటీ సమీపంలో భారీ కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేసింది. ఇందులో రెండువేల మంది ఉద్యోగులు పనిచేయవచ్చు. ట్రాపికల్ ఫారెస్ట్ థీమ్తో దీనిని నిర్మించింది. ఇక్కడ 150 జాతులకు చెందిన ఎనిమిది వేల మొక్కలు నాటింది. ఈ బిల్డింగ్లో ప్రైవేటు ఆఫీసులు, మీటింగ్ రూమ్స్, ఫుడ్ అండ్ బేవరేజెస్, టెర్రస్ కేఫ్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఇందులో స్పేస్ కొనుగోలు కోసం చాలా కంపెనీలతో చర్చిస్తున్నామని, కొన్ని అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నామని స్కూటర్ కంట్రీ హెడ్ రజత్ జోహార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ‘వెలుగు’తో మాట్లాడుతూ ‘‘స్కూటర్ ఫారెస్ట్ బిల్డింగ్ 3.25 లక్షల చదరపు అడుగుల మేర విస్తరించి ఉంటుంది. ఇందులో సదుపాయాల కల్పనకు రూ.3.5 కోట్ల దాకా ఖర్చు చేశాం. హైదరాబాద్లోనే మాకు డాలస్ సెంటర్ హైహోమ్ ట్వీజాలోనూ ఆఫీస్ స్పేస్ ప్రాపర్టీలు ఉన్నాయి. ప్రస్తుతం మాకు ఐదు క్లయింట్ల వరకు ఉన్నారు. ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, జైపూర్ సహా తొమ్మిది సిటీల్లో బిల్డింగ్స్ను కంపెనీలకు లీజుకు ఇస్తున్నాం. త్వరలో బెంగళూరు, పుణే మార్కెట్లకు కూడా వెళ్తాం. మనదేశంలో టీకాల వేగం పుంజుకుంది. ఎంప్లాయిస్ తిరిగి ఆఫీసులకు వస్తున్నారు. ఆఫీసు స్పేసుకు డిమాండ్ పెరుగుతోంది. కంపెనీలు సొంతంగా బిల్డింగులు కట్టుకునే బదులు మావంటి ఆపరేటర్ల దగ్గర నుంచి ఆఫీసును అద్దెకు తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి’’ అని ఆయన వివరించారు.
