గ్రేటర్​లో చెల్లని ఓట్లే 80,889

గ్రేటర్​లో చెల్లని ఓట్లే 80,889
  • మైలార్ దేవ్ పల్లి డివిజన్ లో అత్యధికంగా 1,749 ఓట్లు తిరస్కరణ
  • నోటాకు 29,107 ఓట్లు 
  • కొన్ని డివిజన్లలో గెలుపోటములపై రిజెక్టెడ్, నోటా ఓట్ల ఎఫెక్ట్

హైదరాబాద్, వెలుగుజీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు రిజెక్ట్​ అయ్యాయి. ఏకంగా 80,889 ఓట్లు చెల్లకుండా పోయాయి. బ్యాలెట్ పేపర్​పై ఎక్కువ చోట్ల ముద్ర వేయడం, పెన్నులు, ఇతర మార్కర్లతో రాయడం, అసలు ఓటు ముద్ర వెయ్యకుండా ఖాళీగా ఉంచడం వంటివాటి కారణంగా రిజెక్ట్​ అయినట్టు ఎలక్షన్​ అధికారులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్​లో కూడా వందల సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతోపాటు కొందరు ఓటర్లు నోటాకు ఓటేశారు. స్టేట్​ ఎలక్షన్​ కమిషన్​ ఇచ్చిన రిజల్ట్స్​ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

ఎంఐఎం గెలిచిన చోట్ల ఎక్కువగా..

రిజెక్టెడ్​ ఓట్లను పరిశీలిస్తే మైలార్​దేవ్​పల్లి డివిజన్​లో అతి ఎక్కువగా 1,749 ఓట్లు చెల్లకుండా పోయాయి. బంజారాహిల్స్ లో తక్కువగా126 ఓట్లు చెల్లలేదు. ఈ డివిజన్​లో టీఆర్ఎస్​ క్యాండిడేట్​ సమీప బీజేపీ క్యాండిడేట్​పై కేవలం 781 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ డివిజన్​లో 805 ఓట్లు నోటాకు పడగా.. 126 ఓట్లు రిజెక్ట్ ​అయ్యాయి. అంటే ఈ రెండూ కూడా ఫలితాలపై ప్రభావం చూపాయి. అలాగే గాజుల రామారం టీఆర్ఎస్​ క్యాండిడేట్​కు మొత్తంగా 13,267 ఓట్లు వస్తే.. ఓడిపోయిన కాంగ్రెస్​ క్యాండిడేట్ కు 12,830 ఓట్లు పడ్డాయి. కేవలం 437 ఓట్లే తేడా. ఇక్కడ రిజెక్ట్​ అయిన ఓట్లు 1,110 కాగా.. నోటాకు పడినవి 208. ఇక మొత్తంగా చూస్తే.. ఎంఐఎం గెలిచిన డివిజన్లలో ఎక్కువ సంఖ్యలో ఓట్లు రిజెక్ట్​ అయ్యాయి.

ఈవీఎం ఉంటే రిజెక్ట్​ ఉండదు

సాధారణంగా ఈవీఎంలతో ఓటింగ్​ నిర్వహిస్తే ఓట్లు రిజెక్ట్​ కావడం అనే సమస్య ఉండదు. బ్యాలెట్​ పద్ధతిలో ఓట్లు తిరస్కరణకు చాన్స్​ ఎక్కువ. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే జరిగింది. బ్యాలెట్​ పేపర్​పై క్యాండిడేట్ల  గుర్తుల దగ్గర.. ఈసీ అధికారులిచ్చే స్వస్తిక్​ స్టాంపింగ్​సరిగ్గా వేయాలి. అలాకాకుండా వేలి ముద్ర, మార్కింగ్, పెన్నుతో టిక్​ చేయడం, రెండు, మూడు బాక్సులలో స్టాంపింగ్​చేయడం, సంతకాలు, ఇతర రాతలు రాయడం వంటివి చేస్తే ఓటు చెల్లదు. కొందరు ఓటు ముద్ర వేయకుండా బ్యాలెట్​ పేపర్​ ను ఖాళీగానే ఉంచేస్తారు. అది చెల్లని ఓటు అవుతుంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని పోలింగ్​ బూతుల్లో స్వస్తిక్​ గుర్తు బదులు మరొక స్టాంప్​ను వినియోగించారు. ఆ ఓట్లను కూడా రిజెక్ట్​ చేశారు.

బంజారాహిల్స్​లో నోటాకు ఎక్కువగా..

గ్రేటర్​ హైదరాబాద్​లో మొత్తం 74.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 34 లక్షల మంది ఓట్లు వేశారు. పోలైన ఓట్లలో 2.4 శాతం రిజెక్ట్​ అయ్యాయి. నోటాకు 29,107 ఓట్లు (0.9 శాతం) పడ్డాయి. రెండూ కలిపితే.. లక్షా 9 వేల ఓట్లు (3.3 శాతం ఓట్లు) ఏ క్యాండిడేట్​కూ పడలేదు. అసలు గ్రేటర్​ ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని.. ఒకవేళ క్యాండిడేట్లు ఎవరూ నచ్చకపోతే నోటాకైనా ఓటేయాలన్న ప్రచారం జరిగింది. కొందరు లీడర్లు కూడా అట్లాంటి ప్రకటనలు చేశారు. దీంతో నోటాకు ఓట్లు పెరిగాయని ఎలక్షన్​ కమిషన్​ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఐటీ, బిజినెస్​ పర్సన్స్, డబ్బున్నవాళ్లు ఎక్కువగా ఉండే బంజారా హిల్స్​ డివిజన్​లో అత్యధికంగా నోటాకు 805 ఓట్లు పడ్డాయి. అతి తక్కువగా శాస్ర్తిపురం డివిజన్ లో 31 ఓట్లు పడ్డాయి. మజ్లిస్​ పార్టీ గెలుపొందిన సంతోష్​ నగర్, రియాసత్​ నగర్, కంచన్​బాగ్, బార్కాస్, చాంద్రాయణ​గుట్ట, ఉప్పుగూడ తదితర డివిజన్లలోనూ నోటాకు తక్కువ ఓట్లు వచ్చాయి.