హైదరాబాద్, వెలుగు: కట్టిన మూడేండ్లలోనే మేడిగడ్డ బ్యారేజీ 5 అడుగులు మేర కుంగిపోయిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన సీవీసీకి ఫిర్యాదు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంలో ఎలాంటి కుట్ర కోణం లేదని స్వయంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ రిపోర్ట్ ఇచ్చారని గుర్తు చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా మేడిగడ్డ బ్యారేజీపై రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు.
150 ఏండ్ల కిందట కాటన్ కట్టిన బ్యారేజీ, 50 ఏండ్ల కిందట కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, నిజాంసాగర్, శ్రీరామ్ సాగర్ వంటి డ్యామ్లు ఇంత వరకు చెక్కు చెదరలేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం మూడేండ్లయినా కాకముందే మునిగిపోతున్నదని, బ్యారేజీ కుంగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడి వేలాది కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్, హరీశ్ రావుల ఎలక్షన్ అఫిడవిట్లు, ఆస్తుల వివరాల ఆధారంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సీవీసీని కోరారు. బ్యారేజీ ప్రధాన కాంట్రాక్టర్ సాయంతో 8 మంది ఇంజనీర్లు, అధికారులు అవినీతికి పాల్పడి బ్యారేజీని నాణ్యత లేకుండా నిర్మించారని ఆరోపించారు.