హైదరాబాద్, వెలుగు: బంజారాహిల్స్ లోని మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్లో సైబర్ నేరగాళ్లు హై టెక్నాలజీని వాడినట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ సర్వీసెస్(వీపీఎన్)ను వాడి ఐపీ అడ్రెస్ ట్రేస్ కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆపరేట్ చేశారు. దీంతో హ్యాకర్స్ ఎక్కడి నుంచి అటాక్ చేశారనేది గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. 5 రోజుల క్రితం మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ చెస్ట్ అకౌంట్ నుంచి రూ.12.40 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.2.5 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. రూ.10.4 కోట్లను సైబర్ నేరగాళ్లు వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. గతేడాది ఇదే తరహాలో టీఎస్ కో అపెక్స్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.1.97 కోట్లు కొట్టేశారు. ఈ కేసులో అకౌంట్స్ ఓపెన్ చేసిన యాసిన్ బాష, మహ్మద్ రఫి తప్ప హ్యాకర్ పోలీసులకు చిక్కలేదు. ప్రస్తుతం మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులోనూ హ్యాకర్స్ వీపీన్ ను వాడటంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది.
కూకట్పల్లి మహేష్ బ్రాంచ్లో ఓపెన్ చేసిన ఫార్మా
హౌస్కి చెందిన అకౌంట్కి రూ.50 లక్షలు ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించారు. ఈ డబ్బును మరోచోట విత్ డ్రా చేసినట్లు ఆధారాలు సేకరించారు. సంపత్ పేరుతో అకౌంట్ ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే విధంగా గోల్కొండకి చెందిన మహిళ షాన్ వాజ్ ఈ నెల 11న మహేష్ బ్యాంక్ లో రెండు అకౌంట్లను ఓపెన్ చేసింది. సైబర్ ఫ్రాడ్ జరిగిన రోజే ఆమె అకౌంట్కి రూ. 6 కోట్ల 90 లక్షలు ట్రాన్స్ ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. షాన్ వాజ్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన నరేశ్కు శాన్విక్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో మహేష్ బ్యాంక్లోఅకౌంట్ ఉండగా.. ఈ అకౌంట్ నుంచి కూడా మనీ ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించారు. శాన్విక ఎంటర్ ప్రైజెస్ షాన్వాజ్ పేరు మీదు ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. నరేశ్ను విచారించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. మొబైల్ స్విచాఫ్ రావడంతో అతడి కోసం గాలిస్తున్నారు. సైబర్ ఫ్రాడ్ జరగక ముందు నరేశ్ అకౌంట్ నుంచి ఎలాంటి ట్రాన్జాక్షన్లు లేకపోవడంతో అనుమానిస్తున్నారు.
ఇంటర్నేషనల్ ఏజెన్సీల సహకారంతో..
సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో కలిసి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీల సహకారంతో హ్యాకర్స్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన 3 కరెంట్ అకౌంట్లలో హిందుస్తాన్ ట్రేడర్స్కి చెందిన వినోద్ రాథేను గురువారం విచారించారు. గొల్లకిడికి చెందిన వినోద్ రాథే బేగంబజార్లో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. వినోద్ ప్రమేయం లేకుండానే అమౌంట్ డిపాజిట్,ట్రాన్స్ఫర్ జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. బ్యాంక్ సర్వర్లో లోపాలే హ్యాకింగ్ కారణమని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆన్ లైన్ బ్యాంకింగ్ లో సరైన సైబర్ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోలేదన్నారు. బ్యాంకర్లకు కౌన్సెలింగ్ ఇస్తామన్నారు.