
- 8 మహిళా గ్రూప్ లోన్లకి సంబంధించి రూ.60 లక్షలు పక్కదారి
సిద్దిపేట, వెలుగు: గజ్వేల్ మున్సిపాలిటీ మెప్మాలో మహిళా గ్రూప్ లోన్ల గోల్ మాల్ పై త్రిసభ్య కమిటీ లోతుగా విచారణ ప్రారంభించింది. 8 గ్రూపుల్లోని సభ్యులకు తెలియకుండానే మెప్మాలో పనిచేసే ఉద్యోగులు రూ.60 లక్షలకు పైగా రుణాలను పక్కదారి పట్టించారు. మూడు నెలల కింద మహిళా గ్రూపులకు చెందిన రుణాలను కొందరు వ్యక్తిగత ఖాతాల్లోకి మల్లించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీకి చెందిన శివశంకరి, నెహ్రూ, లీలశ్రీతో పాటు మరో ఐదు గ్రూపుల్లో పరిచయం లేని వ్యక్తుల పేర్లను నమోదు చేసి గ్రూపు పేర్లు మార్చి లోన్లు తీసుకున్నట్లు తెలిసింది.
మెప్మా విభాగంలో పనిచేసే ఆర్పీ (రిసోర్స్పర్సన్) తమను మోసం చేసిందని పలు గ్రూపులకు చెందిన మహిళలు కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే సీవో ఒత్తిడి వల్లే తాను అలా చేయాల్సి వచ్చిందని ఆర్పీ లిఖిత పూర్వకంగా అధికారులకు వివరణ ఇచ్చింది. దీనిపై స్పందించిన కలెక్టర్ జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ, మెప్మా జిల్లా ఇన్చార్జి హన్మంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నర్సయ్యతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు.
గ్రూపుల వారీగా రికార్డుల తనిఖీ
మహిళా గ్రూపుల రికార్డులను త్రిసభ్య కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్నిచోట్ల సభ్యుల ఫొటోలను మార్చినట్టుగా సమాచారం. సభ్యుల ఖాతాల నుంచి ఇతర వ్యక్తుల వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు ఎలా మళ్లించారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవకతవకలకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను
సేకరిస్తున్నారు.
సహకరించని బ్యాంకర్లు
రుణాల అవకతవకలు జరిగిన 8 గ్రూపుల ఖాతాలు ఎస్బీఐలో5, యూనియన్ బ్యాంకులో 3 ఉన్నాయి. త్రిసభ్య కమిటీ నాలుగైదు రకాల సమాచారాన్ని బ్యాంకర్లను కోరితే ఓ బ్యాంకు అధికారులు మాత్రం కేవలం స్టేట్ మెంట్మాత్రమే ఇస్తామని, ఇతర వివరాలు ఇవ్వమని చెబుతున్నట్టు సమాచారం. ఒకే రోజులో ఖాతాలు తెరిచి రుణాలు మంజూరు చేయడమే కాకుండా మనీ డ్రా చేయడంతో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రూప్ లీడర్, సభ్యులు లేకుండా బ్యాంకు అధికారులు రుణాలను ఇతరుల ఖాతాల్లోకి ఎలా మళ్లించారని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 60 లక్షలకు పైగా పక్కదారి ?
దాదాపు 8 గ్రూపులకు చెందిన మహిళల పేరిట లోన్లు తీసుకుని రూ.60 లక్షల కు పైగా నిధులు పక్కదారి పట్టిచ్చినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మెప్మా పరిధిలో మొత్తం 24 గ్రూపులుంటే ఈ ఏడాది రూ.24 కోట్ల మేర రుణాలు ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నారు. వాటిని సాధించే ప్రయత్నం లో కొందరు మెప్మా సిబ్బంది సభ్యుల అసవరాలకు మించి రుణాలను ఇప్పించి అందులోంచి పెద్ద మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. మూడు నెలల కింద ఓ మహిళ తనకు రూ.50 వేల రుణం కావాలని ఆర్పీని కోరితే ఆ గ్రూపునకు రూ.15 లక్షల రుణాన్ని ఇప్పించారు. సదరు మహిళ తాను రూ.50 వేలు అడిగితే రూ.2 లక్షలు ఎందుకిచ్చారని ప్రశ్నించగా మెప్మా సిబ్బంది ఆమెకు సర్ది చెప్పారు. ఇలాంటి సంఘటనలే మరో రెండు గ్రూపు సభ్యులకు ఎదురవడంతో వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో మహిళా గ్రూపుల రుణాలు దారి మళ్లినట్టుగా గుర్తించారు. ఈ నిధులతో మెప్మా లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు బంగారం కొనుగోలు చేసినట్టు విచారణ లో గుర్తించారు.
బ్యాంకు రికార్డులు ఇవ్వడం లేదు
గజ్వేల్ మెప్మా మహిళా గ్రూప్ రుణాల అవకతవకలకు సంబంధించి రుణాలు మంజూరు చేసిన ఓ బ్యాంకు అధికారులు వివరాలు ఇవ్వకపోవడం వల్ల విచారణకు ఆటంకం కలుగుతోంది. సదరు బ్యాంకు అధికారులు స్టేట్ మెంట్మాత్రమే ఇస్తూ మేము కోరిన వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి బ్యాంకు నుంచి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. సాధ్యమైనంత తొందర్లో విచారణ పూర్తి చేసి కలెక్టర్ కు నివేదికను సమర్పిస్తాం.
జయశ్రీ, జిల్లా ఆడిటర్, త్రిసభ్య కమిటీ మెంబర్