
హైదరాబాద్, వెలుగు: గొర్రెల పంపిణీ స్కామ్లో ఏసీబీ అధికారులు సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన రైతులను విచారిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో ఐదుగురి స్టేట్మెంట్ రికార్డు చేశారు. వారి నుంచి గొర్రెలను కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకున్నట్టు సమాచారం.
ఈ కేసులో 24 మందికి పైగా సాక్షులను విచారించారు. ఇప్పటికే 18మంది బాధితుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. వీరికి అందాల్సిన రూ.2.10 కోట్లు 10 అకౌంట్స్లోకి దారిమళ్లించినట్టు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. పల్నాడు జిల్లా రైతులకు చేరాల్సిన డబ్బును నవాజ్, హిమజ మల్ల, కండ్రకోట కోటేశ్వరరావు, కొత్తకోట శ్రీనివాసులు, లింగ కోటేశ్వరరావు, లింగ రవితేజ, శెట్టి, మహ్మద్ అలీ, ఎల్ల పవన్ కల్యాణ్, పోలయ్య పేర్లతో ఉన్న అకౌంట్స్కు మళ్లించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం రూ.700 కోట్లకు సంబంధించిన స్కామ్ గుట్టువిప్పేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రభుత్వానికి ప్రాథిమిక నివేదిక అందించారు.