న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి కిందటి నెలలో రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకు ముందు నెలలో వచ్చిన రూ.22,633 కోట్లతో పోలిస్తే 16 శాతం తగ్గాయి. ఎలక్షన్స్ ముందు మార్కెట్లో వోలటాలిటి పెరగడంతో లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి ఇన్ఫ్లోస్ భారీగా తగ్గాయి. వరుసగా 38 వ నెలలోనూ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లోస్ చూశాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) గురువారం పేర్కొంది.
కిందటి నెలలో ఇన్ఫ్లోస్ తగ్గినప్పటికీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వస్తున్న పెట్టుబడులు రూ.20,371 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు నెలలో సిప్ల ద్వారా రూ.19,271 కోట్ల ఇన్ఫ్లోస్ వచ్చాయి. కొత్తగా 63.65 లక్షల సిప్ అకౌంట్లు ఏప్రిల్లో యాడ్ అయ్యాయని, దీంతో మొత్తం సిప్ అకౌంట్లు 8.7 కోట్లకు చేరుకున్నాయని యాంఫి పేర్కొంది.
డెట్ ఫండ్స్ కూడా పరిగణనలోకి తీసుకుంటే కిందటి నెలలో రూ.2.4 లక్షల కోట్ల ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఇందులో డెట్ స్కీమ్లోకి వచ్చిన ఫండ్స్ రూ. 1.9 లక్షల కోట్లు. మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేస్తున్న అసెట్స్ (ఏయూఎం) ఏప్రిల్ నాటికి రూ.57.26 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ నెంబర్ రూ.53.54 లక్షల కోట్లుగా ఉంది.