
ముంబై: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్ఎల్) షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. రిలయన్స్ షేర్హోల్డర్ల కోసం బై 1 గెట్1 తరహాలో ముకేశ్ అంబానీ ఈ నెల 8 న ఆఫర్ ప్రకటించారు. అప్పటి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను ప్రతి రోజూ ఇన్వెస్టర్లు కొంటూనే ఉండటం విశేషం. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ హోల్డర్ల సంఖ్య 36 లక్షలు. వీరందరికీ ప్రతి ఒక్క ఆర్ఐఎల్ షేర్కూ ఒక జియో ఫైనాన్షియల్ షేరు పొందడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. బుధవారం కూడా రిలయన్స్ షేరు ఆల్టైమ్ క్లోజింగ్ హై రూ. 2,853 రికార్డు చేసింది. దీంతో రిలయన్స్ మార్కెట్ వాల్యూ రూ. 19.30 లక్షల కోట్లకు చేరుకుంది.
జియో షేర్ వాల్యూ ఎంత?
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్ వాల్యూ లెక్కించడం కోసం గురువారం రిలయన్స్ షేర్లలో స్పెషల్ ప్రీ–ఓపెన్ సెషన్ జరగనుంది. బుధవారం ఆర్ఐఎల్ క్లోజింగ్ధరకు, గురువారం జరిగే ప్రీ–ఓపెన్ సెషన్లో షేర్ ధరకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని జియో ఫైనాన్షియల్ షేరుకు కన్స్టెంట్ వాల్యూగా పరిగణిస్తారు. ఈ ప్రీ–ఓపెన్ సెషన్ గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో జరుగుతుంది.
జియోపై అంచనాలు...
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాల్యుయేషన్ రూ. లక్ష కోట్ల మార్కు దాటదని అంచనా. దీంతో బ్రోకరేజ్లు జేఎఫ్ఎస్ఎల్ షేర్ విలువ రూ. 160–రూ. 190 మధ్యలో ఉంటుందని చెబుతున్నాయి. జేఎఫ్ఎస్ఎల్ షేరు రూ. 160 గా యాక్సిస్ సెక్యూరిటీస్, రూ. 168 గా, నువామా, రూ. 189 గా జేపీ మోర్గాన్, రూ. 179 గా జెఫ్రీస్ అంచనా వేశాయి.
డీమెర్జర్ ఎందుకు...
ఫైనాన్షియల్ సర్వీసెస్లో దూసుకెళ్లేందుకు ప్రత్యేక వ్యూహం అవసరం. అందుకే కంపెనీని డీమెర్జర్ చేయాలని ఆర్ఐఎల్ మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది. జియో ఫైనాన్షియల్ను విడదీయడం వల్ల ఆర్ఐఎల్ షేర్ హోల్డర్లకు విలువ పరంగా ప్రయోజనం కలుగుతుందనే ఆలోచనా మరో కారణం.
లిస్టింగ్ ఎప్పుడు...
జేఎఫ్ఎస్ఎల్ షేర్లు రాబోయే 2–3 నెలల్లో మార్కెట్లో లిస్టవుతాయి. రిలయన్స్ ఏజీఎంలో ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.