మార్కెట్లోకి ఐ ఫోన్ 15.. భారత్ లో అమ్మకాలు ప్రారంభం

మార్కెట్లోకి ఐ ఫోన్ 15.. భారత్ లో అమ్మకాలు ప్రారంభం

ముంబై: భారత్ లో ఐఫోన్–15  అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రిలయన్స్ జియో వరల్డ్‌ డ్రైవ్‌లోని యాపిల్ బీకేసీ స్టోర్‌తోపాటు ఢిల్లీలోని సెలెక్ట్‌ సిటీవాక్‌ మాల్‌లో ఉన్న యాపిల్‌ సాకేత్‌ స్టోర్‌ ముందు ఐఫోన్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్‌ 15 , ఐఫోన్ 15 ప్లస్ , ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ ను అందుబాటులో ఉంచింది. భారత్‌ మార్కెట్లో ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.79,900గా కంపెనీ నిర్ణయించింది.

ఇక ఐఫోన్ 15 ప్లస్‌ రూ.89,900 కాగా, ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,34,900, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను రూ.1,59,900కి విక్రయించనుంది.   లాంఛ్‌ ఆఫర్‌ కింది హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో ఐఫోన్ 15 సిరీస్‌ను కొనుగోలు చేసేవారికి ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. ఐఫోన్ 15  ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ కొనుగోలు చేసేవారికి రూ.6,000 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‌పై రూ.5,000 డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతోపాటు పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా ట్రేడ్‌-ఇన్‌ బెనిఫిట్‌ కింద డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇవే కాకుండా ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లు ఐఫోన్ 15 అమ్మకాలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తుండటం విశేషం.

తాజాగా సినీనటుడు మాధవన్‌ ఐఫోన్‌ 15 కొన్నట్లు ఎక్స్‌ లో ట్వీట్‌ చేశారు. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా ఐఫోన్‌ 15 ను సొంతం చేసుకున్నందుకు ఎంతో గర్వంగా, థ్రిల్‌గా ఉంది ’ అంటూ పింక్‌ కలర్‌లో కొత్తగా కొన్న ఐఫోన్15 ఫొటోతో పాటు జాతీయ జెండా ఎమోజీలను జోడించారు.