తొలి మ్యాచ్లో ఎదురైన పరాజయం నుంచి చెన్నై సూపర్కింగ్స్ తొందరగానే తేరుకుంది. బ్యాటింగ్, బౌలింగ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. దీంతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సీఎస్కే 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడిన పంజాబ్ 20 ఓవర్లలో 106/8 స్కోరు చేసింది. షారుక్ ఖాన్ (36 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47) మినహా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత చెన్నై 15.4 ఓవర్లలో107/4 స్కోరు చేసి గెలిచింది. డుప్లెసిస్, మొయిన్ సెకండ్ వికెట్కు 46 బాల్స్లో 66 పార్ట్నర్షిప్ నెలకొల్పారు.చహర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
టాప్ లేపిన దీపక్
ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు స్టార్టింగ్ నుంచే ఏదీ కలిసి రాలేదు. చెన్నై బౌలర్లు చేసిన ఎదురుదాడిలో స్టార్లందరూ పెవిలియన్కు క్యూ కట్టారు. ముఖ్యంగా పిచ్ నుంచి సహకారం అందుకున్న దీపక్ చహర్.. బంతితో వీరవిహారం చేశాడు. వరుసగా నాలుగు ఓవర్లు వేసిన అతను నాలుగు వికెట్లు తీసి పంజాబ్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్కు మయాంక్ (0) ఔట్తో మొదలైన వికెట్లపతనం చివరి వరకు సాగింది. సెకండ్ ఓవర్లో ఫోర్తో టచ్లోకి వచ్చిన రాహుల్ (5)ను.. తర్వాతి ఓవర్లోనే జడేజా అద్భుతమైన రనౌట్ చేశాడు. ఇక నాలుగో ఓవర్లో చహర్ డబుల్ మ్యాజిక్ చేశాడు. మూడు బాల్స్ తేడాలో గేల్ (10), పూరన్ (0)ను పెవిలియన్కు పంపడంతో పవర్ప్లేలో పంజాబ్ 26/4 స్కోరుతో డీలా పడింది. ఇక ఫోర్తో ఖాతా తెరిచిన హుడా (10)ను ఏడో ఓవర్లోనే చహర్ ఔట్ చేయడంతో పంజాబ్ స్కోరు 26/5గా మారింది. ఈ దశలో షారుక్ ఖాన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. రిచర్డ్సన్ (15) కొద్దిగా సమన్వయం చూపెట్టడంతో షారుక్ స్వేచ్ఛగా షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. జడేజా, అలీ బౌలింగ్లో రెండు సిక్సర్లతో రెచ్చిపోయిన అతను వీలైనప్పుడల్లా బౌండరీలు కూడా రాబట్టాడు. అయినా 10 ఓవర్లకు పంజాబ్ స్కోరు 48/5గానే ఉంది. తర్వాత ప్రతి ఓవర్లో సింగిల్ డిజిట్ స్కోరు మాత్రమే వచ్చింది. ఈ క్రమంలో 13వ ఓవర్లో రిచర్డ్సన్ ఔట్కావడంతో ఆరో వికెట్కు 31 పార్ట్నర్షిప్ ముగిసింది. మరో ఎండ్లో నిలకడగా ఆడుతున్న షారుక్కు అశ్విన్ (6) కొద్దిసేపు సహకారం అందించాడు. ఎనిమిదో వికెట్కు 30 రన్స్ జోడించి ఔటయ్యాడు. హాఫ్ సెంచరీకి దగ్గరైన షారుక్ లాస్ట్ ఓవర్లో ఔటయ్యాడు. చివరి 10 ఓవర్లలో 58 రన్స్ చేసిన పంజాబ్ అతి కష్టమ్మీద 100 దాటింది.
డుప్లెసిస్, అలీ నిలకడ
భారీ టార్గెట్ కాకపోవడంతో ధోనీసేన నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. మూడు ఓవర్స్లో 4 రన్సే వచ్చాయి. 4వ ఓవర్లో డుప్లెసిస్ 4, 4, 6తో 14 రన్స్ రాబట్టాడు. కానీ తర్వాతి ఓవర్లోనే రుతురాజ్ (5) ఔటయ్యాడు. వన్డౌన్లో వచ్చిన మొయిన్ అలీ జోరు చూపెట్టాడు. ఓవర్కు ఒకటి, రెండు బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పెంచాడు. ఫలితంగా పవర్ప్లేలో 32/1 స్కోరు చేసిన చెన్నై 10 ఓవర్లలో 64/1 స్కోరుకు చేరింది. సెకండ్ స్పెల్కు వచ్చిన షమీని కూడా అలీ వదల్లేదు. 11వ ఓవర్లో రెండు ఫోర్లు, ఆ తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ ఓ ఫోర్ కొట్టడంతో మొత్తం 20 రన్స్ వచ్చాయి. స్పిన్నర్ అశ్విన్ ఫస్ట్ బాల్ను స్టాండ్స్లోకి పంపిన అలీ.. మరో షాట్కు ట్రై చేసి డీప్ మిడ్ వికెట్లో షారుక్ చేతికి చిక్కాడు. ఆపై, ఫోర్తో ఖాతా తెరిచిన రైనా (8),రాయుడు (0) వరుస బాల్స్లో ఔటైనా.. సామ్ కరన్ (5 నాటౌట్) విజయానికి అవసరమైన రన్స్ అందించాడు.
పంజాబ్: రాహుల్ (రనౌట్) 5, మయాంక్ (బి) చహర్ 0, గేల్ (సి) జడేజా (బి) చహర్ 10, దీపక్ హుడా (సి) డుప్లెసిస్ (బి) చహర్ 10, పూరన్ (సి) ఠాకూర్ (బి) చహర్ 0, షారుక్ ఖాన్ (సి) జడేజా (బి) కరన్ 47, రిచర్డ్సన్ (బి) అలీ 15, అశ్విన్ (సి) డుప్లెసిస్ (బి) బ్రావో 6, షమీ (నాటౌట్) 9, మెరిడిత్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 106/8. వికెట్లపతనం: 1–1, 2–15, 3–19, 4–19, 5–26, 6–57, 7–87, 8–101. బౌలింగ్: దీపక్ చహర్ 4–1–13–4, సామ్ కరన్ 3–0–12–1, శార్దూల్ ఠాకూర్ 4–0–35–0, జడేజా 4–0–19–0, అలీ 3–0–17–1, బ్రావో 2–0–10–1.
చెన్నై: రుతురాజ్ (సి) హుడా (బి) అర్షదీప్ సింగ్ 5, డుప్లెసిస్ (నాటౌట్) 36, మొయిన్ అలీ (సి) షారుక్ (బి) అశ్విన్ 46, రైనా (సి) రాహుల్ (బి) షమీ 8, రాయుడు (సి) పూరన్ (బి) షమీ 0, కరన్ (నాటౌట్) 5, ఎక్స్ట్రాలు: 7, మొత్తం: 15.4 ఓవర్లలో 107/4. వికెట్లపతనం: 1–24, 2–90, 3–99, 4–99. బౌలింగ్: షమీ 4–0–21–2, రిచర్డ్సన్ 3–0–21–0, అర్షదీప్ సింగ్ 2–0–7–1, మెరిడిత్ 3.4–0–21–0, మురుగన్ అశ్విన్ 3–0–32–1.