- రాజస్తాన్పై 86 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ
- ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
షార్జా: ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జూలు విదిల్చింది. ఆల్రౌండ్ షోతో అదరగొడుతూ.. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో 86 రన్స్ భారీ తేడాతో రాజస్తాన్ రాయల్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 రన్స్ చేసింది. శుభ్మన్ గిల్ (44 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 56), వెంకటేశ్ అయ్యర్ (35 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) రాణించారు. తర్వాత రాజస్తాన్ 16.1 ఓవర్లలో 85 రన్స్కే కుప్పకూలింది. తెవాటియా (36 బాల్స్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) టాప్ స్కోరర్. శివమ్ మావికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. కాగా, లీగ్లో ఏడో విక్టరీతో పాటు మెరుగైన రన్రేట్తో కోల్కతా (14 పాయింట్లు) ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగే మ్యాచ్లో ముంబై 171 రన్స్ తేడాతో హైదరాబాద్పై గెలిస్తేనే ప్లే ఆఫ్స్కు వెళుతుంది. లేదంటే కేకేఆర్ ముందుకెళ్తుంది. --
ఓపెనింగ్ అదుర్స్..
కీలక మ్యాచ్ కావడంతో కోల్కతా ఓపెనర్లు గిల్, వెంకటేశ్ స్టార్టింగ్లో చాలా అప్రమత్తంగా ఆడారు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదినా.. సింగిల్స్కు కూడా ప్రాధాన్యమిచ్చారు. దీంతో రన్రేట్ తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. ఫలితంగా పవర్ప్లేలో 34 రన్స్ వచ్చాయి. జైదేవ్ వేసిన 10వ ఓవర్లో అయ్యర్ 6, 6తో 14 రన్స్ పిండుకున్నాడు. 7 నుంచి 10 ఓవర్ల మధ్య 35 రన్స్ రావడంతో ఫస్ట్ టెన్లో కేకేఆర్ 69/0 స్కోరు చేసింది. 11వ ఓవర్లో స్పిన్నర్ తెవాటియా... అయ్యర్ను ఔట్ చేయడంతో ఫస్ట్ వికెట్కు 79 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. నెక్స్ట్ ఓవర్లో నితీశ్ రాణా (12).. 4, 6తో రెచ్చిపోయినా ఐదో బాల్కు వెనుదిరిగాడు. 7 బాల్స్ తేడాలో రెండు వికెట్లు పడటంతో నైట్రైడర్స్ స్కోరు 92/2గా మారింది. త్రిపాఠి (21) దూబే బౌలింగ్లో వరుస ఫోర్లు రాబట్టాడు. 11 నుంచి 15 ఓవర్లలో 58 రన్స్ రావడంతో నైట్రైడర్స్ 127/2 స్కోరుతో పటిష్ట స్థితికి చేరుకుంది. ఈ దశలో 10 బాల్స్ తేడాలో గిల్, త్రిపాఠి ఔటయ్యారు. ఈ ఇద్దరు థర్డ్ వికెట్కు 41 రన్స్ జోడించారు. ఆఖర్లో మోర్గాన్ (13 నాటౌట్), దినేశ్ కార్తీక్ (14 నాటౌట్) వీలైనంత వేగంగా ఆడారు.
పెవిలియన్కు క్యూ..
భారీ టార్గెట్ ఛేజింగ్లో రాజస్తాన్ ఆరంభం నుంచే తడబడింది. యశస్వి (0) డకౌట్కాగా, లివింగ్స్టోన్ (6), శాంసన్ (1), అనుజ్ రావత్ (0) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో 13/4 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడిన రాయల్స్ను శివమ్ దూబే (18), గ్లెన్ ఫిలిప్స్ (8) ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 8వ ఓవర్లో శివమ్ మావి (4/21) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగు బాల్స్ తేడాలో ఈ ఇద్దర్ని ఔట్ చేశాడు. నెక్స్ట్ ఓవర్లో మోరిస్ (0)ను వరుణ్ పెవిలియన్కు పంపాడు. 10 బాల్స్ తేడాలో మూడు కీలక వికెట్లు పడటంతో రాజస్తాన్ స్కోరు 35/7కు పడింది. ఈ దశలో తెవాటియా మొండిగా పోరాడినా.. రెండో ఎండ్లో జైదేవ్ (6), సకారియా (1) నిరాశపర్చారు. ఒత్తిడి తట్టుకోలేని తెవాటియా.. 17వ ఓవర్లో భారీ షాట్కు ట్రై చేసి ఔట్కావడంతో రాజస్తాన్ ఇన్నింగ్స్కు 85 రన్స్ వద్ద తెరపడింది. ఫెర్గుసన్ 3 వికెట్లు తీశాడు.