
చెన్నై: హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఓ విజయం సాధించి గాడిలో పడ్డ సన్రైజర్స్ హైడరాబాద్ మరో పోరాటానికి సిద్ధమైంది. ఇక్కడి, చెపాక్ స్టేడియంలో ఆదివారం జరిగే మ్యాచ్లో బలమైన ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీ కొట్టనుంది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు గెలిచిన ఢిల్లీ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. తమ గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు షాకిచ్చి గెలుపు బాట పట్టిన సన్రైజర్స్ జోరు కొనసాగించాలని చూస్తోంది. కానీ, ఢిల్లీని కట్టడి చేయడం సన్రైజర్స్కు కత్తి మీద సాము అనే చెప్పాలి. అయితే, ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చెపాక్ వికెట్ ఈ మ్యాచ్లో ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. చెన్నై వేదికగా ఈ సీజన్లో ఇప్పటిదాకా తొమ్మిది మ్యాచ్లు జరగ్గా కేవలం రెండు సార్లే 170 కంటే ఎక్కువ స్కోరు రికార్డ్ అయ్యింది. సన్రైజర్స్, క్యాపిటల్స్ పోరుతో చెన్నైలో మ్యాచ్లు ముగుస్తాయి. బ్యాట్స్మెన్కు సవాలు విసురుతున్న చెపాక్ స్లో వికెట్ను అర్థం చేసుకునేందుకు హైదరాబాద్కు నాలుగు మ్యాచ్లు అవసరమయ్యాయి. ఇక, జట్టు విషయానికొస్తే కేన్ విలియమ్సన్ ఎంట్రీతో లైనప్లో బ్యాలెన్స్ పెరిగింది. ఇండియా కుర్రాళ్లు అంచనాలు అందుకోవడంలో ఫెయిలవడంతో బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ డేవిడ్ వార్నర్, విలియమ్సన్, బెయిర్ స్టో పైనే ఉండనుంది. బౌలింగ్లో రషీద్ ఖాన్ మరోసారి కీలకం కానున్నాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్పై రషీద్కు మంచి రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య మినీ వార్ ఖాయమని భావిస్తున్నారు. ఇక, సన్రైజర్స్తో పోలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది. బ్యాట్స్మెన్ అంతా టచ్లో ఉన్నారు. ముఖ్యంగా ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధవన్ సూపర్ ఫామ్లో ఉండటం వారికి బాగా కలిసొస్తుంది. కెప్టెన్ పంత్ నుంచి జట్టు మెరుపు ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక, చెపాక్ స్లో వికెట్పై స్పిన్నర్లు అశ్విన్, అమిత్ మిశ్రా కీలకం కానున్నారు.