
- ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి!
చెన్నై: ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఆల్రౌండ్ షోతో అదరగొడుతూ లో స్కోరింగ్ మ్యాచ్ను అద్భుతంగా కాపాడుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సీఎస్కే 27 రన్స్ తేడాతో ఢిల్లీకి చెక్ పెట్టింది. 11 మ్యాచ్ల్లో ఏడో ఓటమితో డీసీ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. టాస్ గెలిచిన చెన్నై 20 ఓవర్లలో 167/8 స్కోరు చేసింది. శివమ్ దూబే (12 బాల్స్లో 3 సిక్స్లతో 25) టాప్ స్కోరర్. చివర్లో ధోనీ (9 బాల్స్లో 1 ఫోర్, 2 సిక్స్లతో 20) చెలరేగాడు. తర్వాత మతీష పతిరణ (3/37), దీపక్ చహర్ (2/28) సూపర్ బౌలింగ్ దెబ్బకు ఢిల్లీ 20 ఓవర్లలో 140/8 స్కోరుకే పరిమితమైంది. రిలీ రోసోవ్ (35) మెరుగ్గా ఆడాడు. ఒక వికెట్కూడా తీసిన జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
తలో చేయి..
బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై ముందుగా బ్యాటింగ్కు దిగిన సీఎస్కే బ్యాటర్లు భారీ స్కోర్లు చేయలేకపోయారు. దీనికి తోడు క్యాపిటల్స్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడటంతో రన్స్ చాలా కష్టంగా వచ్చాయి. మిచెల్ మార్ష్ (3/18), అక్షర్ పటేల్ (2/27)కు తోడు కుల్దీప్ యాదవ్ (1/28), లలిత్ (1/34) చెన్నైని కట్టడి చేశారు. ఇషాంత్ వేసిన రెండో ఓవర్లో రుతురాజ్ (24) మూడు ఫోర్లు కొట్టినా, అవతలివైపు డేవన్ కాన్వే (10) విఫలమయ్యాడు. మూడో ఓవర్లో ఖలీల్ ఇన్స్వింగర్ కాన్వే బ్యాట్ను తాకినా డీసీ రివ్యూకు వెళ్లలేదు. అయినా కాన్వే దీనిని సద్వినియోగం చేసుకోలేదు. చివరకు ఐదో ఓవర్లో అక్షర్ పటేల్కు వికెట్ ఇచ్చుకున్నాడు. సీఎస్కే 49/1తో పవర్ప్లేను ముగించింది. ఏడో ఓవర్లో రుతురాజ్ను ఔట్ చేసి అక్షర్ రెండో వికెట్ సాధించాడు. అజింక్యా రహానె (21) ఓ మాదిరిగా ఆడినా మొయిన్ అలీ (7) నిరాశపర్చాడు. ఫలితంగా ఒక్క సిక్స్ కూడా లేకుండానే చెన్నై తొలి పది ఓవర్లను ముగించింది. 11వ ఓవర్లో దూబే తొలి సిక్స్ కొట్టగా, తర్వాతి ఓవర్లో లలిత్ యాదవ్ సూపర్ క్యాచ్కు రహానె వెనుదిరిగాడు. అంబటి రాయుడు (23)తో కలిసి ఐదో వికెట్కు 36 రన్స్ జోడించి దూబే ఔటయ్యాడు. రెండు ఓవర్ల తర్వాత రాయుడు కూడా వికెట్ ఇచ్చుకోవడంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. మహీ19వ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టి జడేజా (21)తో ఆరో వికెట్కు 18 బాల్స్లోనే 38 రన్స్ జత చేయడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
టాప్ ఫెయిల్..
ఛేజింగ్లో డీసీకి ఆరంభం కలిసి రాలేదు. దీపక్చహర్ దెబ్బకు ఓపెనర్లు వార్నర్ (0), ఫిల్ సాల్ట్ (17) ఔటవగా.. మిచెల్ మార్ష్ (5) నిరాశ పరచడంతో 25/3తో డీలా పడ్డది. ఈ దశలో మనీష్ పాండే (27), రిలీ రోసోవ్ నెమ్మదిగా ఆడటంతో పవర్ప్లేలో ఢిల్లీ 47/3 స్కోరు మాత్రమే చేసింది. తర్వాత కూడా వీళ్లు భారీ షాట్లు కొట్టలేకపోయారు. బాల్కు ఓ రన్ లెక్కన చేశారు. దాంతో, సాధించాల్సిన రన్రేట్ అమాంతం పెరిగింది. నాలుగో వికెట్కు 59 రన్స్ జోడించి పాండే ఔటయ్యాడు. మరో ఓవర్ తర్వాత రోసోవ్ కూడా వెనుదిరగడంతో డీసీ వెనకబడింది. చివర్లో రిపల్ పటేల్ (10) అండతో అక్షర్ పటేల్ (21) ఆరో వికెట్కు 27 రన్స్ జత చేసినా ఫలితం లేకపోయింది. 19వ ఓవర్లో రిపల్ రనౌట్ కాగా, ఆఖరి ఓవర్లో లలిత్ యాదవ్ (12) హ్యాట్రిక్ ఫోర్లు కొట్టినా ఢిల్లీ టార్గెట్కు చాలా దూరంలో నిలిచిపోయింది.