ఐదో ప్లేస్‌‌‌‌తో ఐపీఎల్ ను ముగించిన ఢిల్లీ

 ఐదో ప్లేస్‌‌‌‌తో ఐపీఎల్ ను  ముగించిన ఢిల్లీ

జైపూర్‌‌‌‌‌‌‌‌: కొద్దిలో ప్లేఆఫ్స్‌‌ బెర్తును చేజార్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌ ఆఖరి లీగ్‌‌ పోరులో విజయం సాధించి ఐదో ప్లేస్‌‌తో ఐపీఎల్‌‌18ను ముగించింది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తూ  టాప్ ప్లేస్‌‌పై కన్నేసిన పంజాబ్ కింగ్స్‌‌ను దెబ్బకొట్టింది. సమీర్ రిజ్వీ (25 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 నాటౌట్‌‌) లీగ్‌‌లో తొలి ఫిఫ్టీతో సత్తా చాటడంతో శనివారం జరిగిన  మ్యాచ్‌‌లో  ఢిల్లీ 6  వికెట్ల తేడాతో పంజాబ్‌‌ను ఓడించింది.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌‌కు వచ్చిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 206/8 స్కోరు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53), మార్కస్ స్టోయినిస్ (16 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో నాటౌట్‌‌) సత్తా చాటారు. ఓపెనర్‌‌‌‌ ప్రియాన్ష్ ఆర్య  (6) ఫెయిలైనా ప్రభ్‌‌సిమ్రన్ సింగ్ (28), జోష్​ ఇంగ్లిస్ (32)  రాణించారు. ముస్తాఫిజుర్ మూడు, విప్రజ్‌‌ నిగమ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ  19.3 ఓవర్లలో 208/4   స్కోరు చేసి గెలిచింది. కేఎల్ రాహుల్ (35), స్టాండిన్ కెప్టెన్ ఫా డుప్లెసిస్ (23) తొలి వికెట్‌‌కు 55 రన్స్ జోడించి మంచి ఆరంభం అందించారు. వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ ఔటైనా టెస్టు టీమ్‌‌కు సెలెక్ట్ అయిన జోష్​లో కరుణ్ నాయర్ (27 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) మెరుపులు మెరిపించాడు. సెదిఖుల్లా అటల్ (22) కూడా ఆకట్టుకోగా.. చివర్లో సమీర్‌‌‌‌ దూకుడుగా ఆడి జట్టుకు విజయం అందించి ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ గా నిలిచాడు. మొత్తంగా 14 మ్యాచ్‌‌ల్లో ఏడో విజయంతో ఢిల్లీ 15 పాయింట్లు రాబట్టి ఐదో స్థానం సాధించింది.   

సంక్షిప్త స్కోర్లు

పంజాబ్‌‌: 20 ఓవర్లలో 206/8 (శ్రేయస్ 53, స్టోయినిస్ 44 నాటౌట్‌‌, ముస్తాఫిజుర్ 3/33).
ఢిల్లీ: 19.3 ఓవర్లలో 208/4 (సమీర్ 58 నాటౌట్‌‌, కరుణ్ 44, హర్‌‌‌‌ప్రీత్ 2/41).