
ఇరాన్ డాంబికంగా బెదిరింపు మాటలతో ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎన్ని ఎత్తులు, జిత్తులు ఉపయోగించినా ఇజ్రాయెల్, అమెరికాతో జరుగుతున్న యుద్ధం ఎటుదారితీస్తుందో తెలియదు. ఇరాన్ జూన్ 24, 2025న కాల్పుల విరమణకు అంగీకరించక
తప్పని పరిస్థితి! తద్వారా 1979లో ఆయతుల్లా ఖమేనీ ఇరాన్ షాను తొలగించి అధికారం చేపట్టినప్పుడు ప్రారంభమైన తుపాను, హింసాత్మక కథకు ముగింపు పలికింది. ఖచ్చితంగా, ఇరాన్ ఓటమి ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్పులను తెస్తుంది. ఇరాన్లో భారీ చమురు, అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఇరాన్ చాలా సంపన్న దేశం.
1979లో ఆయతుల్లా ఖమేనీ అధికారం చేపట్టినతర్వాత ఇరాన్ అతిపెద్ద ఇస్లామిక్ శక్తిగా మారాలని ఆయన కోరుకున్నాడు. ఈక్రమంలో అనేక దేశాలలో వివిధ మతఛాందస శక్తులను సృష్టించాడు. తీవ్రమైన నిర్ణయాలను తీసుకున్నాడు. ఆయతుల్లాలు అమెరికా, ఇజ్రాయెల్ను బహిరంగంగానే వ్యతిరేకించేవారు.
అయితే, అనూహ్య సంఘటనలు మెరుపు కంటే వేగంగా జరుగుతున్నాయి. జూన్ 13, 2025న, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది.
గత 20 సంవత్సరాలుగా, ఇరాన్ హౌతీలు, హిజ్బుల్లా, హమాస్ వంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థలకు అండగా నిలిచి
గ్రేట్ వారియర్గా ముస్లిం దేశాల్లో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంది. కానీ, 14 రోజుల్లోనే ఇరాన్ భీకర యుద్ధాన్ని ఎదుర్కోక తప్పలేదు. ఇరాన్ ఒక అనూహ్య స్థితికి చేరుకుంది.
గత 43 సంవత్సరాల నుంచి ఇరాన్ మత నాయకత్వం నిరంతరం ఇజ్రాయెల్ను బెదిరిస్తోంది. ఇజ్రాయెల్ను అంతం చేస్తామని చెబుతూనే ఉంది. ఆ దిశగా ఇజ్రాయెల్, అమెరికన్లపై దాడి చేయడానికి ఇరాన్ నిరంతరం హమాస్ ఉగ్రసంస్థను ఉపయోగించింది. ఈనేపథ్యంలో ఇరాన్ అణ్వాయుధాల పెంపుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండటం వల్ల చాలా దేశాలు ఇరాన్ నుంచి ప్రాణాంతకంగా ముప్పేనని భావిస్తూ వస్తున్నాయి.
ఇరాన్ అణుశక్తిని అభివృద్ధి చేయడం ప్రారంభించడం అనేక దేశాలు ఆందోళనకు గురయ్యాయి. అది అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తుందని అందరి అనుమానాలు వాస్తవరూపం దాల్చడం మొదలైంది. దీంతో ఇరాన్ అణుబాంబులను పొందకుండా ఆపడమే.. తమ మనుగడను కొనసాగించేందుకు ఏకైక మార్గం అని ఇజ్రాయెల్ భావించింది. అమెరికాతోపాటు ఇతర అరబ్ ముస్లిం దేశాలు కూడా ఇరాన్ తమకంటే చాలా శక్తిమంతం కావడాన్ని వ్యతిరేకించాయి.
అమెరికా దాడులు
అమెరికా ఇరాన్తో అణుబాంబులను అభివృద్ధి చేయరాదని ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, ఇరాన్ రహస్యంగా అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తోందని అమెరికా, ఇజ్రాయెల్తో సహా అనేక దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన అణు ఆయుధ తయారీ కర్మాగారాలను నాశనం చేయాలని నిర్ణయించుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ఇజ్రాయెల్ జూన్ 13, 2025న ఇరాన్పై యుద్ధం ప్రారంభించింది. అనంతరం ఇజ్రాయెల్, -ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టి ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్పై దాడులకు పూనుకుంది.
దాని అణు కర్మాగారాలను నాశనం చేయడమే లక్ష్యంగా దాడులు చేసింది. ఇరాన్పై దాడికి మరోసారి ఇలాంటి అవకాశం తనకు ఎప్పటికీ రాదని అమెరికా భావించింది. 3 ఇరానియన్ అణుకేంద్రాలపై అమెరికా శక్తిమంతమైన బాంబులతో దాడి చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సాహసోపేతమైన అడుగువేసి, చాలామంది అమెరికన్ అధ్యక్షులు చేయాలనుకున్నది ఆయన చేశారు. -ఇరాన్ అణుశక్తిగా మారకుండా ఆపడమే అమెరికా ప్రధాన లక్ష్యం.
ఇరాన్ సంకట పరిస్థితి
ఇరాన్ ఊహించనిది జరిగింది. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై ఆకస్మిక దాడులను ప్రారంభించాయి. ఇరాన్ యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా లేని సమయంలో దాడులు మొదలయ్యాయి. ఇరాన్ సైనిక శక్తి బలమైనదే. కానీ ఇజ్రాయెల్, అమెరికాను కలిపి ఎదుర్కొనేంత శక్తిమంతమైనది కాదు. అయితే, ఇరాన్ వ్యూహాత్మకంగా రష్యా, చైనాతో పొత్తులు పెట్టుకుంది. కానీ, రష్యా, చైనా మాటలతో మాత్రమే సహాయం అందించాయి. అంతేతప్ప నేరుగా యుద్ధంరంగంలోకి దిగి ఇరాన్కు అవసరమైన సహాయం అందించలేదు.
ఒకవేళ ఇరాన్ యుద్ధాన్ని కొనసాగిస్తే.. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై నిరంతరాయంగా బాంబు దాడులు చేస్తూనే ఉంటాయి. అమెరికా, ఇజ్రాయెల్ ధాటికి ఇరాన్ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. కానీ, 45 సంవత్సరాలుగా ఇరాన్ను పాలిస్తున్న మతపరమైన ప్రభుత్వం తమ మనుగడను కొనసాగించాలని కోరుకుంటుంది.పాకిస్తాన్కు ఇదొక హెచ్చరిక!
గత 15 సంవత్సరాలుగా అమెరికా, యూరప్
ఇరాన్ అణ్వాయుధాల తయారీని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే ఇరాన్పై దాడి చేసి ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారకుండా నిలువరించగలిగారు. కచ్చితంగా ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో కొత్త శకానికి నాంది పలుకుతుంది.
ఇజ్రాయెల్తో పోరాడటానికి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటానికి ఇరాన్ .. హిజ్బుల్లా, హమాస్ వంటి టెర్రరిస్ట్ సంస్థలను సృష్టించింది. ఇప్పుడు ఆ సమస్య తొలగిపోనుంది. ఇప్పటి ఇరాన్ పరిస్థితి పాకిస్తాన్, ఉత్తర కొరియా వంటి దేశాలకు ఒక పెద్ద హెచ్చరిక. ఉత్తర కొరియా, పాకిస్తాన్ అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. అవసరమైతే అణ్వాయుధాలను ఉపయోగిస్తామనే ఆ దేశాల బెదిరింపులను ప్రపంచం ఇక సహించదు. ఇజ్రాయెల్ తన అతిపెద్ద శత్రువు ఇరాన్ను చాలా మేరకు నాశనం చేశామనే ధీమాతో ఉన్నది.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు చేసింది సాహస యుద్ధమే. యుద్ధం లేకపోతే.. చమురు ధరలు తగ్గుతాయి. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం తాము మాత్రమే సూపర్- పవర్ అని అమెరికా తన ఖ్యాతిని స్థాపించుకుంది. పలు కారణాలరీత్యా రష్యా, చైనాలకు ఇజ్రాయెల్, ఇరాన్యుద్ధంలో ప్రత్యక్షంగా కల్పించుకోవాలనే ఆసక్తి లేదు.
పాకిస్తాన్ కామిక్ రోల్
ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసినప్పుడు, పాకిస్తాన్ ఇరాన్కు సహాయం చేస్తానని హామీ ఇచ్చింది. కానీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అమెరికా వెళ్లి అధ్యక్షుడు ట్రంప్ను కలిశారు. ట్రంప్ ఆతిథ్యాన్ని స్వీకరించారు. వెంటనే, పాకిస్తాన్లో ట్రంప్ పాక్కు సహాయం చేస్తారని వేడుకలు జరిగాయి. అయితే, పాకిస్తాన్ఊహించనివిధంగా మరుసటి రోజు ట్రంప్ ఇరాన్పై బాంబుదాడి చేశాడు. ఇరాన్పై అమెరికా దాడి ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న పెద్ద ఇబ్బందికి దారితీసింది.
యుద్ధం జరుగుతున్న సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ ట్రంప్తో లంచ్ చేయడం పాక్ ప్రజలు జీర్ణించుకోలేక పోయారు కూడా. ముస్లిం దేశాలు అమెరికాతో ఉన్నాయని ఇరాన్కు చూపించడానికి వ్యూహాత్మకంగా అమెరికా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫొటోను ఒక అవకాశం కోసం ఉపయోగించుకుంది. పాకిస్తాన్ తన కామిక్ రోల్తో ప్రపంచాన్ని
అలరిస్తూనే ఉంది.
భారతదేశంపై ప్రభావం
కాశ్మీర్ విషయంలో ఆయతుల్లా ఖమేనీ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు ఖమేనీ పాకిస్తాన్ మద్దతుకి సంబంధించి ఎలాంటి ప్రభావం ఉండదు. భవిష్యత్తులో ఇరాన్ దూకుడు తగ్గి పాకిస్తాన్ పట్ల సానుభూతి తగ్గనుంది. ఇరానియన్ చాబహార్ పోర్టుపై భారతదేశానికి పెద్ద ఆసక్తి ఉంది. శాంతి నెలకొంటే భారతదేశం ఆ పోర్టును అభివృద్ధి చేయగలదు. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాకు ప్రయోజనం చేకూరుతుంది. అణుబాంబులతో భారతదేశాన్ని బెదిరించలేమని పాకిస్తాన్ అర్థం చేసుకుంటుంది.
భారతదేశం కూడా పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు పెరగవచ్చు. ఇరాన్కు ఎదురవుతున్న పరిస్థితులు చూశాక ఉగ్రవాద శక్తులు వెనక్కి తగ్గుతాయి. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు ఉగ్రవాద సంస్థలకు అవసరమైన నిధులు ఇవ్వలేదు. ఇది ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారతదేశానికి ఎంతో సహాయపడుతుంది.
- డా.పెంటపాటి పుల్లారావు,పొలిటికల్ ఎనలిస్ట్