
కరోనా దెబ్బకు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3,500మంది చనిపోగా ఇరాన్ దేశంలో 237మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 7,640మందికి వైరస్ సోకడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. చైనా తర్వాత ఇటలీ,ఇరాన్,దక్షిణ కొరియా దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. గత గురువారం ఈ వైరస్ బారిన పడి ఇరాన్ విదేశాంగ మంత్రి సలహాదారు హుస్సేన్ షేఖోలెస్లాం కూడా మృతి చెందారు.
ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం.. తమ దేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 70వేల మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ విషయాన్ని ఇరానియన్ జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైజీ వెల్లడించారు. ఖైదీల విడుదల చేయడం వల్ల సమాజంలో ఎలాంటి అభద్రతా భావం కలగదని ఆయన అన్నారు. అయితే, విడుదలైన వారు తిరిగి జైళ్లకు రావాల్సిన అవసరం ఉందో, లేదో అనే విషయాన్ని మాత్రం రైజీ తెలుపలేదు.