మేడిగడ్డ బ్యారేజీపై అఫిడవిట్ల సమర్పణ

మేడిగడ్డ బ్యారేజీపై అఫిడవిట్ల సమర్పణ
  •     ఇవాళ మిగతావి కూడా అందజేసే అవకాశం
  •     మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద కొనసాగుతున్న రిపేర్లు
  •     జియోటెక్నికల్​టెస్టులను మొదలుపెట్టిన సీడబ్ల్యూపీఆర్ఎస్​
  •     సీస్మిక్​ టెస్టుల కోసం

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీపై ఇరిగేషన్​ శాఖలోని దాదాపు అన్ని విభాగాలూ కాళేశ్వరం జుడీషియల్​ కమిషన్​కు అఫిడవిట్లు సమర్పించినట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని విభాగాల అధికారులను కమిషన్​ చైర్​పర్సన్​ జస్టిస్​ పినాకీ చంద్ర ఘోష్​ విచారించారు. డిజైన్లు, క్వాలిటీ  కంట్రోల్, ఓ అండ్​ఎం, ఎస్​డీఎస్ఓ, హైడ్రాలజీ తదితర విభాగాల అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈనెల 27 లోపు అఫిడవిట్ల రూపంలో వివరాలు ఇవ్వాలని వారిని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు విభాగాలు తప్ప మిగతా అన్ని శాఖల అధికారులు అఫిడవిట్లు సమర్పించినట్లు సమాచారం. గురువారం స్టేట్​ డ్యామ్​ సేఫ్టీ ఆర్గనైజేషన్​ (ఎస్​డీఎస్ఓ) అధికారులు అఫిడవిట్లు సమర్పించారు. సేఫ్టీ సేఫ్టీ ప్రొటోకాల్​ వివరాలను అందజేశారు. బ్యారేజీ నిర్మాణం మొదలు కుంగిపోయే దాకా జరిగిన పరిణామాలను ఆ అఫిడవిట్లలో వివరించినట్లు  తెలిసింది. బ్యారేజీ నిర్మాణానికి ముందు చేసిన ఇన్వెస్టిగేషన్లు తదితర వివరాలను అందజేశారు. బ్యారేజీలో కుంగిన 20వ పిల్లర్​ కింద ఏర్పడిన భారీ గొయ్యిలో గ్రౌటింగ్​ చేస్తున్న విధానాలను కూడా అఫిడవిట్​లో పొందుపరిచారు. కాగా, శుక్రవారం కూడా కొందరు అధికారులు అఫిడవిట్లు సమర్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

కొనసాగుతున్న టెస్టులు

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద సెంట్రల్​ వాటర్​ పవర్​ రిసర్చ్​ స్టేషన్​ (సీడబ్ల్యూపీఆర్ఎస్) జియోటెక్నికల్​ ఎంక్వయిరీ  కొనసాగుతోంది. టెస్టుల్లో భాగంగా బ్యారేజీకి దిగువన, ఎగువన భూకంప ప్రభావాలను తెలుసుకునే సీస్మిక్​ ఇన్వెస్టిగేషన్స్​ను సంస్థకు చెందిన నిపుణులు చేస్తున్నారు. ప్రతి పిల్లర్​ వద్ద 25 మీటర్ల లోతులో బోర్  హోల్స్​ తవ్వి కేసింగ్​ వేసే పనులను చేయిస్తున్నారు. ఆ పనులు పూర్తికాగానే ఆయా చోట్ల సీస్మిక్​ అనాలిసిస్​ను సీడబ్ల్యూపీఆర్​ఎస్​ నిపుణులు స్టార్ట్​ చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చెందిన సెంట్రల్​ సాయిల్​ మెటీరియల్​ రిసర్చ్​ స్టేషన్​ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణులు అక్కడి నేల పరిస్థితులపై పరీక్షలు చేశారు. రిపోర్ట్​ను సిద్ధం చేస్తున్నారు. అయితే, సీడబ్ల్యూపీఆర్ఎస్​ టెస్టులకు ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉండడంతో రిపోర్ట్​ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి జులై 7 నాటికి ఫుల్​ రిపోర్ట్​ ఇవ్వాలని నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) ని కమిషన్​ చైర్​పర్సన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ ఇప్పటికే ఆదేశించారు. అయితే, సీడబ్ల్యూపీఆర్​ఎస్​, సీఎస్ఎంఆర్ఎస్​ నివేదికలు వచ్చాకే వాటిని పరిశీలించి బ్యారేజీల వద్ద పరిస్థితిపై నివేదిక ఇస్తామని ఎన్​డీఎస్ఏ అధికారులు చెబుతున్నట్లు  తెలిసింది. ఈ నేపథ్యంలోనే జులై 7 వరకు ఎన్​డీఎస్ఏ రిపోర్టు​ సిద్ధమవ్వడం అనుమానంగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల తొలి వారంలో జస్టిస్​ ఘోష్​ మరో దఫా విచారణ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. 

పనులకు ఇంకో వారం

మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల వద్ద పనులు చకచకా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మరో వారంలో పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే షీట్​పైల్స్​ రీప్లేస్​మెంట్​ జరిగిందని, గ్రౌటింగ్​కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పారు. కొట్టుకుపోయిన సీసీ బ్లాకుల స్థానంలో కొత్త సీసీ బ్లాకులను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే గేట్లన్నింటినీ ఓపెన్​ చేసి పెట్టారని, గేబియన్​ వాల్స్​ ప్రొటెక్షన్​ పెట్టి పనులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వరదలు మొదలయ్యే నాటికి బ్యారేజీకి తాత్కాలిక రిపేర్లు  పూర్తవుతాయని స్పష్టం చేశారు.