
బాన్సువాడ రూరల్, వెలుగు: బాన్సువాడ నియోజకవర్గంలో లోటు వర్షపాతం నమోదైంది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నియోజకవర్గంలో అడపాదడపా కురిసిన వానలకు కొన్ని గ్రామాల చెరువుల్లో కొంత నీరు చేరింది. కానీ కొన్ని చెరువుల తూము షటర్లు దెబ్బతిని నీరు వృథాగా బయటికి వెళ్లిపోతుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామ ఊర చెరువు రెండు తూముల షట్టర్ విరిగిపోయి రెండేళ్లవుతుంది. షట్టర్ చెరువులో పడిపోకుండా ఉండడానికి తాళ్లతో చెట్లకు కట్టేసి ఉంచారు. నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామ ఊర చెరువు తూముకు సైతం షట్టర్ ఏడాదిగా లేదు. దీంతో చెరువులోకి వచ్చిన సాగునీరు వృథాగా పోతోంది. ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూములకు షట్టర్లను ఏర్పాటు చేసి సాగునీటిని కాపాడాలని ఆఫీసర్లను కోరుతున్నారు.