
IPL Insurance Claim: భారతదేశంలో క్రికెట్ అభిమానులను అనేక సంవత్సరాలుగా అలరిస్తోంది ఐపీఎల్. అయితే తాజాగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న మిలిటరీ టెన్షన్స్ కారణంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భద్రతా కారణాల దృష్యా మ్యాచ్ లను వారం పాటు రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే మ్యాచ్ లు తర్వాత ఎప్పుడు తిరిగి ప్రారంభమౌతాయి అనే అంశంపై వచ్చేవారం అప్డేట్ ఇవ్వొచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం ఐపీల్ సీజన్లో జరగాల్సిన మ్యాచ్ లను రద్దు చేయటం వల్ల బీసీసీఐకి ఒక్కో మ్యాచ్ కి రూ.125 కోట్ల వరకు నష్టం వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు చాలా మందికి వస్తున్న అనుమానం బీసీసీఐ ఈ నష్టాలను ఇన్సూరెన్స్ సంస్థల నుంచి వసూలు చేస్తుందా లేదా అనేదాని గురించే. నిపుణులు చెబుతున్న మాటేటంటే ఐపీఎల్ 2025ని పూర్తిగా రద్దు చేస్తే తప్ప బీసీసీఐ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పొందలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి మే 25 వరకు షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉంది. కానీ యుద్ధ మేఘాలు అలుముకోవటంతో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి.
►ALSO READ | IPL 2025: ఐపీఎల్ సస్పెన్షన్ కారణంగా బీసీసీఐకి భారీ నష్టం.. ఒక్క మ్యాచ్కు ఏకంగా రూ. 125 కోట్లా..
టాటా ఐపీఎల్ 2025ను వారం పాటు నిలిపివేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని బ్రాడ్ కాస్టింగ్ పార్ట్నర్ జియో స్టార్ కూడా స్వాగతించింది. వాస్తవానికి జియో స్టాక్ ఓటీటీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందినదని మనందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో దేశానికి అండగా ఉండాలని, ప్రభుత్వం సాయుధ దళాల చెంత నిలబడాలని నిర్ణయించినట్లు జియోస్టార్ పేర్కొంది. అలాగే ఉద్రిక్తతల కారణంగా ప్రభావితమైన పౌరులకు సహాయం చేయాలని పేర్కొంది.
తగిన సమయంలో టోర్నమెంట్ను తిరిగి తీసుకురావడానికి, అందుకు అవసరమైన అన్ని ప్రక్రియలు ముందుకు సాగేందుకు తాము బీసీసీఐతో కలిసి పనిచేస్తామని జియోస్టార్ స్పష్టం చేసింది.