వానాకాలం వస్తే జలుబు, జ్వరం రావడం మామూలే. ఇవి సీజనల్గా వచ్చేవే అని నిర్లక్ష్యం చేయొద్దు. అసలే ఎక్కడ కరోనా థర్డ్ వేవ్ దాడి చేస్తుందోనని ప్రపంచదేశాలు వణికి పోతున్నాయి. కానీ, వ్యాక్సిన్ వల్ల భయం నుంచి కొంత రిలీఫ్ దొరుకుతున్నట్టే అనిపిస్తుంది. అయితే ఈ వానాకాలంలో వచ్చే డెంగీ ఫీవర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కరోనా లాగే డెంగీకి కూడా మెడిసిన్ లేదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ముప్పు తప్పినట్టు. రోగం వచ్చాక ట్రీట్మెంట్ గురించి ఆలోచించడం కంటే... దాని బారిన పడకుండా ఉండటం మేలు అంటున్నారు డాక్టర్లు.
డెంగీ వచ్చినవాళ్లకి ఫీవర్,వాంతులు, లూజ్ మోషన్స్, బాడీ, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. దోమ కుట్టిన తర్వాత రెండు రోజుల లోపు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇది మామూలు జ్వరమే, కొంతమందిలో అయితే వచ్చినట్లు కూడా తెలీదు. డెంగీ రావడానికి కారణం ‘ఏడిస్ ఈజిప్టై’, ‘ఏడిస్ ఎల్బోపిక్టస్’ అనే రెండు రకాల దోమలు. ఏడిస్ ఎల్బోపిక్టస్ ఈ దోమలు మనిషికీ మనిషికి మధ్య వెక్టార్లాగా పనిచేస్తాయి. అంటే దోమ కుడితే వైరస్ దానిలోకి చేరుతుంది. అదే దోమ వేరొక హెల్దీ పర్సన్కి కుట్టినప్పుడు ఆ వైరస్ బాడీలోకి వెళుతుంది. అయితే డెంగీ సోకిన వ్యక్తుల్లో మూడురకాల లక్షణాలు కనిపిస్తాయి. క్లాసికల్, సివియర్, ఏటిపికల్.
క్లాసికల్ – 5 నుంచి 7 రోజుల్లో ఎక్కువ జ్వరం వస్తుంది. టెంపరేచర్ వంద పైగా ఉంటుంది. నార్మల్ మెడిసిన్కి బాడీ రియాక్ట్ అవ్వదు. బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మోషన్స్, తలనొప్పి ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. ఎముకలు అరిగినట్టు నొప్పి వస్తుంది. దాదాపు వారం రోజులు జ్వరం వస్తుంది. ఒక్కోసారి సడెన్గా తగ్గిపోతుంది కూడా. అలా ఫీవర్ తగ్గిందంటే, ప్లేట్లెట్స్ పడిపోవడం, లేదా ఇతర ఇబ్బందులేవైనా తలెత్తడం జరుగుతుంది. ఇంకొందరికి ఇలాంటి లక్షణాలేవీ కనిపించవు. అలాగని నిర్లక్ష్యం చేయకూడదు. మూడు నాలుగు రోజులు గమనించాలి. సడెన్గా తీవ్రమైన తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, ఛాతి నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి, ముక్కు, నోరు, యూరిన్, మోషన్లో రక్తస్రావం అవడం జరుగుతాయి. ఇవన్నీ జ్వరం తగ్గిపోయినప్పుడు, సడెన్గా ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల వచ్చేవి. వీటిని వార్నింగ్ సిగ్నల్స్ అంటారు. ఇలాంటివి వస్తే వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇవేమీ రాకపోతే, పడిపోయిన ప్లేట్లెట్స్ మళ్లీ నార్మల్ కౌంట్కి వచ్చేస్తాయి. ఇది వారం రోజుల తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది.
సివియర్ – ఇందులో డెంగీ హెమరైజిక్ ఫీవర్, డెంగీ షార్ప్ సిండ్రోమ్ అని రెండు రకాలుం టాయి. రెండింటి వల్ల మల్టిపుల్ఆర్గాన్ డ్యామేజ్ జరుగుతుంది. అంటే రకరకాల అవయవాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల పేషెంట్ లైఫ్కి ప్రమాదం. దీనివల్ల దాదాపు ఐదు శాతం మంది ఎఫెక్ట్ అవుతారు.
ఏటిపికల్ – ఒక అవయవానికి ఎక్కువ డేమేజ్ అవ్వడం. బ్రెయిన్, లివర్, లంగ్ డ్యామేజ్, కొవిడ్ లక్షణాలు, హార్ట్ డ్యామేజ్లతో వస్తుంటారు. దీనివల్ల పేషెంట్ లైఫ్కి చాలా ప్రమాదం. కొన్ని రీసెర్చ్లలో యాంటీసైక్లిన్ అనే యాంటీ బయాటిక్ ఉంది. అది కొంతవరకు పని చేస్తుందని తెలిసింది. యాంటీ వైరల్ ఏమీ లేదు. ఇప్పుడయితే శ్వాససంబంధిత సమస్యల కోసం మెడిసిన్ ఇస్తున్నారు.
గర్భిణీలకి డెంగీ వస్తే...
ప్రెగ్నెంట్స్కి డెంగీ వస్తే మెటర్నల్, ఫీటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తల్లికి లో– బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. డీ–హైడ్రేషన్ వల్ల గర్భ సంచిలో నీరు తగ్గుతుంది. ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. లంగ్స్లో నీరు చేరే అవకాశం ఎక్కువ. డెంగీ వల్ల ప్రెగ్నెన్సీ పొయే ప్రమాదం ఉంది. సిజేరియన్ చెయ్యాల్సిన అవకాశాలు ఎక్కువ.
డెంగీకి వ్యాక్సిన్ ఉందా?
ఈ మధ్య కొన్ని కంపెనీలు డెంగీకి వ్యాక్సిన్ తయారు చేసేందుకు రెడీ అయ్యాయి. విదేశాల్లో ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే రెండు మూడేళ్లలో డెంగీకి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. సీజనల్గా వచ్చే ఫ్లూకి ఎలాగైతే వ్యాక్సిన్ ఇస్తున్నారో డెంగీకి కూడా వ్యాక్సిన్ ఇస్తే బాగుంటుంది. డెంగీ అని మొదటి రోజు గుర్తించలేం. ల్యాబ్ రిపోర్ట్ బట్టే తెలుస్తుంది. మొదటిరోజుల్లో యాంటీ ఎన్ఎస్ –1 అనే యాంటిజెన్ ఉంటుంది. మూడోరోజు డెంగీ అని తెలుస్తుంది. నాలుగో రోజు డెంగీ ఐజియం యాంటీ బాడీస్ చూడాలి.
జాగ్రత్తలు
- ఇంటి పరిసరాల్లో చెత్తా చెదారం, నీళ్లు నిల్వ ఉంటే మున్సిపాలిటీ వాళ్లకి చెప్పి క్లీన్ చేయించాలి.
- తేమ లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి.
- కిచెన్, బయో వేస్ట్లు ఇంట్లో ఉంచొద్దు. వైరస్లు అక్కడే వేగంగా పెరుగుతాయి.
- తెల్లవారుజాము నుంచి సూర్యా స్తమయం వరకూ డెంగీ దోమలు తిరుగుతుంటాయి. బయటికెళ్లేటప్పుడు ఫుల్ స్లీవ్స్ ఉండే డ్రెస్లు వేసుకోవాలి.
- ఉదయంపూట డెంగీ దోమలు కుట్టే అవకాశం ఎక్కువ.
- మస్కిటో రెపెల్లెంట్ క్రీమ్లు రాసుకోవాలి. లివర్, లంగ్స్ డిసీజెస్, డయాబెటిస్ వంటి వ్యాధులున్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
- మనీష పరిమి
కరోనా వచ్చిన వాళ్లకి డెంగీ వస్తే...
కరోనా, డెంగీ రెండూ ఒకేసారి వస్తే దాన్ని ‘డ్యూయెల్ ఇన్ఫెక్షన్’ అంటారు. ఇలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. లక్షణాలు అన్నీ కొవిడ్, డెంగీ రెండిటికీ లక్షణాలు ఒకేలా ఉంటాయి. వాటిని కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంటోంది. వీటిని అడ్డుకోవాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ వల్ల కొవిడ్, డెంగీలు వచ్చినా ప్రమాదం తక్కువే. రెండూ ఒకేసారి వస్తే ఆర్గాన్ డ్యామేజ్ జరుగుతుంది. కొవిడ్ తగ్గాక, డెంగీ వచ్చినవాళ్లకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. అలాగే స్టిరాయిడ్స్ వాడేవాళ్లకి డెంగీ వస్తే ‘మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్’ అయ్యే ప్రమాదం ఉంది. మరికొన్ని స్టడీలలో అయితే డ్యూయెల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్లకి టెస్ట్ చేస్తే నెగెటివ్ రిపోర్ట్ వస్తున్నాయని తేలింది. అలాంటప్పుడు సిటిస్కాన్ చేసి లేదా రోగి లక్షణాలను బట్టి గుర్తిస్తారు. మైల్డ్ డెంగీ, కొవిడ్ ఉన్నవాళ్లలో పాజిటివ్ రిపోర్ట్ చూపిస్తుంది.
- డా. రాహుల్ అగర్వాల్, సీనియర్ కన్సల్టెంట్, కేర్ హాస్పిటల్, హైదరాబాద్