
ప్రపంచంలోని దేశాలన్నీ ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు భారత్ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న ఆయన సియోర్రాలియోన్లో నిన్న జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాల్ని ఏకాకులను చేయాలన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమేనన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్కు మద్దతుగా నిలుస్తున్న సియోర్రా లియోన్ అధ్యక్షుడు జులియస్ మాడా బయోకు ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక జనాభా కలిగిన భారత్తో పాటు ఆఫ్రికా దేశాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తగిన ప్రాధాన్యం కల్పించాల్సి అవసరం ఉందన్నారు.
ఆ తర్వాత అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ సియోర్రాలియోన్, భారత్ మధ్య సత్సంబంధాలకు వారధిగా భారతీయులు నిలుస్తున్నారని ప్రశంసించారు వెంకయ్యనాయుడు. వ్యవసాయం, ఆహార శుద్ధి, సమాచార సాంకేతిక రంగాల్లో భారత్, సియోర్రాలియోన్ పరస్పర సహకారం మరింత పెరిగేలా చూడాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు.