
గాజా స్ట్రిప్: గాజాలో ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నిరంతరాయంగా కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 72 మంది మరణించారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వారం రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.
ఇంతకుముందు ఈ ఏడాది జనవరిలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే హమాస్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ మార్చిలో ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది. కాగా, హమాస్ దగ్గర ఇంకా 50 మంది బందీలు ఉన్నారు. వాళ్లందరినీ విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. అయితే, హమాస్ దగ్గరున్న ఆయుధాలన్నీ అప్పగించాలని, ఆ సంస్థను బహిష్కరించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది.
ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద కాల్పులు..
ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల దగ్గరికి వచ్చే పాలస్తీనియన్లపై కాల్పులు జరపాలని సైన్యానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని గాజా సర్కార్ ఆరోపించింది. ఇలా ఇప్పటికే 500 మందిని చంపేసిందని తెలిపింది. ఫుడ్ కోసం సహాయక కేంద్రాల వద్దకు వెళ్తున్న తమపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరుపుతున్నదని బాధితులు వాపోయారు.
అమెరికా, ఇజ్రాయెల్ నేతృత్వంలో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సహాయక కేంద్రాల వద్ద మారణహోమం సృష్టిస్తున్నారని.. వాటిని హత్యా కేంద్రాలుగా మార్చారని యూఎస్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ హెడ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రభుత్వం తోసిపుచ్చింది. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. తమ మిలిటరీ ప్రతిష్టను దిగజార్చేందుకు చేస్తున్న ప్రయత్నమని ఫైర్ అయింది. కాగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 56,412 మంది చనిపోయారని.. 1,33,054 మంది గాయపడ్డారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.