ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి.. రేడియేషన్ ధాటికి జనం పరుగులు.. ప్రభావం ఎంత వరకు ఉండొచ్చు..?

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి..  రేడియేషన్ ధాటికి జనం పరుగులు.. ప్రభావం ఎంత వరకు ఉండొచ్చు..?

ఏదైతే జరగకూడదు అని ప్రపంచం అంతా అనుకుంటుందో అదే జరిగింది. ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరిట ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేయడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది.  అణు స్థావరాలపై దాడి చేయడంతో రేడియేషన్ ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. న్యూక్లియర్ సైట్ దాడితో రేడియేషన్ వస్తుండటంతో జనాలు పరుగులు తీస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 

న్యూక్లియర్ సైట్ పై దాడి చేయడంతో రేడియో ధార్మిక శక్తితో పాటు కెమికల్స్ విడుదలవుతున్నాయని.. ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తుందని ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ (IAEA) చీఫ్ రఫేల్ గ్రోసీ అన్నారు. ఇరాన్ లోని నతాన్జ్ న్యూక్లియర్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని, డీప్ లెవెల్ లో ఎంత వరకు డ్యామేజ్ జరిగిందో తెలియదని అన్నారు. కానీ సైట్ ఉపరితలంపై జరిగిన దాడి కారణంగా రేడియేషన్ విడుదలవుతుందని ఐక్యరాజ్య సమితికి తెలిపారు. 

అణి కేంద్రం చుట్టు పక్కల రేడియేషన్ విడుదలవుతుందని.. ఇది చాలా రోజులు ఉంటుందని తెలిపారు. రేడియేషన్ తో పాటు కెమికల్ తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు . అయితే దీనితో పాటు ఫోర్డో, ఇస్ఫహన్ కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. రేడియేషన్ ప్రభావంతో అణుకేంద్రం చుట్టు పక్కల మిలిటరీ ఆపరేషన్స్ జరగడం కష్టమని అన్నారు. 

అణుబాంబులలో వాడే యురేనియం నిల్వలు ఇరాన్ దగ్గర ఎక్కువ గా ఉన్నాయి. నతాంజ్ ప్లాంట్ లో 60 శాతం ప్యూరిటీ యూరేనియం ఉండగా.. 90 శాతం యురేనియాన్ని ఆయుధాలు, గ్రేడ్ మెటీరియల్స్ తయారీ కొరకే వినియోగిస్తున్నారు. 

ఇరాన్ మిలిటరీ బేస్, ఆర్మీ క్యాంప్, అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు నిర్వహిస్తోంది. శుక్రవారం (జూన్ 13) మొదలైన మిస్సైల్ ఎటాక్ శనివారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే ఇరాన్ కు చెందిన నలుగురు కమాండర్లు, ఆర్మీ అధికారులు మృతి చెందారు. 

ఇజ్రాయెల్ దాడిని తిప్పికొడుతున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ సందర్భంగా విదేశంగా మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ అన్ని లిమిట్స్ ను దాటింది. అంతర్జాతీయ సమాజం ఇలాంటి దాడులను ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆత్మరక్షణలో భాగంగా తిరిగి ఇజ్రాయెల్ పై దాడి చేయడం తమ హక్కుగా ఆయన తెలిపారు. అయితే ఇరాన్ న్యూక్లియర్ ఉత్పత్తిని ఆపేసేవరకు తమ దాడులు కొనసాగుతాయని.. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. 

రేడియేషన్ ఎంత వరకు ఉంటుంది:

అణు విద్యుత్ కేంద్రాలు పేలడం, అణుబాంబులు పేలండంతో చాలా ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి. అయితే అణు బాబు లేదా అణు విద్యుత్ కేంద్రం పేలితే వచ్చే రేడియేషన్ ఎంత మేరకు వ్యాపిస్తుంది.. ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో చర్చిద్దాం. 

ఒక అణుబాంబు పేలినా లేదా అణు కేంద్రం పేల్చేసినా వచ్చే రేడియేషన్ దారుణంగా ఉంటుంది. మొదటగా వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ ప్రభావం పేలిన పదార్థం సైజుపై ఆధారపడి ఉంటుంది.

ఒక 10 కిలో టన్ పేలుడు నుంచి 10 నుంచి 20 మైళ్ల దూరం వరకు రేడియేషన్ వ్యాపిస్తుందని IAEA అధికారులు చెబుతున్నారు. అయితే రేడియో ధార్మిక కణాలు మాత్రం ఏళ్లు తరబడి ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతుంటాయని తెలిపారు. ఇది కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని తెలుస్తుంది.