- బ్లాక్ హోల్స్ పై పరిశోధనకు ‘ఎక్స్ పో శాట్’
- కొత్త ఏడాది మొదటి రోజే పీఎస్ఎల్వీ ప్రయోగం
- ఎక్స్ పో శాట్ సహా పదకొండు ఉపగ్రహాలతో నింగిలోకి..
శ్రీహరికోట: కొత్త ఏడాదికి రాకెట్ ప్రయోగంతో స్వాగతం పలికేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమవుతోంది. కృష్ణ బిలాల(బ్లాక్ హోల్స్)పై అధ్యయనం కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందులో భాగంగానే జనవరి 1న పదకొండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించనుంది. పీఎస్ఎల్వీ –సి58 రాకెట్ ఈ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. వీటిలో ముఖ్యమైన ఉపగ్రహం ఎక్స్ పో శాట్ గా వ్యవహరించే ఎక్స్ రే పొలారిమీటర్ శాటిలైట్.. విశ్వంలోని బ్లాక్ హోల్స్ వంటి వాటిపై కొత్త విశేషాలను బయటపెట్టనుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.. స్పేస్లో ఎక్స్ రే మూలాలను అన్వేషించడమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో పాటు కాస్మిక్ కిరణాలపై దీర్ఘకాలిక అధ్యయనం కూడా ఈ ప్రయోగంలో ఓ భాగమని వివరించారు.
శ్రీహరికోట నుంచి ప్రయోగం..
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో ఈ రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. మొదటి ప్రయోగ వేదిక పై నుంచి ఉదయం 9:10 నిమిషాలకు పీఎస్ఎల్వీ –సీ58 నింగిలోకి ప్రయాణం ప్రారంభించనుంది. ఇందుకోసం ఆదివారం ఉదయం 8:10 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రాకెట్ లో పంపుతున్న ఎక్స్ పోశాట్ ఉపగ్రహం పీవోఎల్ఐఎక్స్ (పోలారిమీటర్ ఇన్ స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్ రేస్). దీనిని రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డిజైన్ చేయగా బెంగళూరుకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ తయారుచేసింది. ఐదేళ్ల పాటు పనిచేసే ఈ ఉపగ్రహం అంతరిక్ష అధ్యయనాలలో కీలకంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.
రాకెట్లోని పేలోడ్స్ ఇవే..
- -ఎక్స్ పో శాట్
- రేడియేషన్ షీల్డింగ్ ఎక్స్ పెరిమెంట్ మాడ్యూల్ (టేక్ మి టు స్పేస్)
- ఎల్బీఎస్ ఇనిస్టిట్యూట్ విద్యార్థినులు తయారు చేసిన శాటిలైట్
- బిలీఫ్ శాట్ (కేజే సోమయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)
- గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మీటర్ (ఇన్సెసిటీ లాబ్స్)
- ఎల్ఈఏటీటీడీ (ధ్రువ స్పేస్ ఏజెన్సీ)
- రుద్ర 0.3 హెచ్ పీజీపీ, ఏఆర్ఏకే 200 (బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్)
- డస్ట్ ఎక్స్ పెరిమెంట్
- ((డీఈఎక్స్– పీఆర్ఎల్ (ఇస్రో))
- ఫ్యూయెల్ సెల్ పవర్ సిస్టం, ఎస్ఐ బేస్డ్ హై ఎనర్జీ సెల్ (విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్)