- ఈ ఏడాది సగటున 9% శాలరీ హైక్ ఉంటుందని అంచనా
- 10–15% మేర ఉద్యోగుల శాలరీని పెంచాలని చూస్తున్న స్టార్టప్లు
- అట్రీషన్ రేటు ఎక్కువగా ఉండడం, టాలెంట్ కొరతే కారణం
బిజినెస్ డెస్క్, వెలుగు: ఈ ఏడాది ఉద్యోగుల శాలరీలు బాగా పెరిగేటట్టు కనిపిస్తున్నాయి. కరోనా ముందు ఇచ్చిన శాలరీ హైక్ కంటే ఈ ఏడాది ఎక్కువ ఇవ్వాలని కంపెనీలు చూస్తున్నాయి. కరోనా సంక్షోభం నుంచి బిజినెస్లు పుంజుకోవడం, మార్కెట్లో టాలెంట్ ఉన్నవాళ్లు తక్కువగా ఉండడంతో ఉద్యోగుల శాలరీలను బాగానే పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ ఏడాది దేశంలోని కంపెనీలు సగటున 9 శాతం శాలరీ హైక్ను చేపట్టనున్నాయని రిక్రూట్మెంట్ ఏజెన్సీ మైకల్ పేజ్ ఇండియా పేర్కొంది. ఈ సర్వే కోసం 13 మేజర్ సెక్టార్లకు చెందిన 500 కంపెనీల నుంచి అభిప్రాయాలను సేకరించింది. స్టార్టప్లు, యూనికార్న్లు, త్వరలో యూనికార్న్లుగా మారబోయే కంపెనీలు ఉద్యోగులకు సగటున 12 శాతం హైక్ను ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని మైకల్ పేజ్ ఇండియా శాలరీ రిపోర్ట్ 2022 వెల్లడించింది. టాలెంట్ ఉన్నవారిని నిలుపుకోవడంలోనూ, ఆకర్షించడంలోనూ స్టార్టప్లు పెద్ద, మీడియం సైజ్ కంపెనీలతో పోటీ పడుతున్నాయి. అందుకే ఉద్యోగుల శాలరీని బాగా పెంచాలనే ఆలోచనలో ఇవి ఉన్నాయి.
ఈ సెక్టార్లలో ఎక్కువ..
గత రెండేళ్ల కంటే ఈ సారి శాలరీ హైక్ ఎక్కువగా ఉంటుందని, కరోనా ముందు లెవెల్స్ను దాటుతుందని మైకల్ పేజ్ ఇండియా ఎండీ అంకిత్ అగర్వాల్ అన్నారు. 2019 లో సగటున 7 శాతం శాలరీ హైక్ను కంపెనీలు చేపట్టాయి. శాలరీ హైక్ ఎక్కువగా ఉండనుండడానికి ప్రధాన కారణాలు అట్రిషన్ (ఉద్యోగులు మానేయడం) రేటు పెరగడం, టాలెంట్ ఉన్నవారు తక్కువగా ఉండడమేనని అంకిత్ అగర్వాల్ అన్నారు. ఐటీ, ఐటీ సంబంధిత సెక్టార్, మాన్యుఫాక్చరింగ్, ఇంజినీరింగ్, హెల్త్కేర్, లైఫ్సైన్సెస్, రిటైల్, గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్ (జీఐసీ), ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ) సెక్టార్లలోని పెద్ద కంపెనీలు ఈ ఏడాది సగటున 8–12 శాతం శాలరీ హైక్ను చేపట్టనున్నాయని మైకల్ పేజ్ ఇండియా శాలరీ సర్వేలో తేలింది. స్టార్టప్లయితే సగటున 10–15 శాతం మేర శాలరీ హైక్ను చేపట్టడానికి రెడీగా ఉన్నాయని పేర్కొంది. కరోనా ముందు మెజార్టీ సెక్టార్లలో శాలరీ హైక్ సగటున 6–8 శాతం మేర ఉండేదని అగర్వాల్ తెలిపారు. టాలెంట్ ఉన్నవారిని దొరకబుచ్చుకోవడంలో స్టార్టప్లకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, టాలెంట్ ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడంలో శాలరీ హైక్లు కీలకంగా ఉన్నాయని అన్నారు. ఫిన్టెక్, కన్జూమర్ టెక్, బీ2బీ, హెల్త్టెక్, క్రిప్టో, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) సెక్టార్లలోని స్టార్టప్లు శాలరీలను ఎక్కువగా పెంచాలని చూస్తున్నాయని అన్నారు.
ప్రొఫెషనల్స్కు మరింత డిమాండ్
అట్రిషన్ రేటు ఎక్కువగా ఉండడం, టాలెంట్ ఉన్నవారు తక్కువగా ఉండడంతో ప్రొఫెషనల్స్కు, మంచి స్కిల్స్ ఉన్నవారికి భారీ మొత్తంలో శాలరీ ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని అంకిత్ అగర్వాల్ అన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో మెజార్టీ కంపెనీలు కరోనా ప్రభావం ఇక ఉండదనే ఆలోచనలో ఉన్నాయని చెప్పారు. ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్పై కంపెనీలు పాజిటివ్గా ఉన్నాయని అన్నారు. వ్యవస్థలో పాజిటివ్ మూడ్ కనిపిస్తోందని అగర్వాల్ పేర్కొన్నారు. స్కిల్స్ ఉన్నవారిని వదులుకోవడానికి కంపెనీలు ఇష్టపడడం లేదు. దీంతో ప్రమోషన్లు, స్టాక్ ఇన్సెంటివ్లు, రిటెన్షన్ బోనస్లు, మిడ్ టెర్మ్ ఇంక్రిమెంట్లు వంటివి ఉద్యోగులకు ఆఫర్ చేస్తున్నాయని ఈ సర్వే పేర్కొంది. తమ టాప్ ఉద్యోగులను నిలుపుకోవడానికి 20–25 శాతం శాలరీ ఇంక్రిమెంట్నైనా ఇవ్వడానికి కొన్ని కంపెనీలు వెనకడుగువేయడం లేదని తెలిపింది. మరోవైపు అట్రిషన్ రేటును తగ్గించేందుకు ఐటీ, ఫిన్టెక్, కన్సల్టింగ్ కంపెనీలు బోనస్లను ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయని ఐటీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బోనస్లను ఆలస్యం చేయడం వలన మానేస్తున్న వారిని భర్తీ చేయడానికి టైమ్ దొరుకుతోందని అంటున్నాయి.