న్యూఢిల్లీ: మన దేశంలో 5 జీ వినియోగం వేగంగా జోరందుకుంటుందని అంచనా వేస్తున్నారు. 10 కోట్ల స్మార్ట్ఫోన్ యూజర్లు ఇండియాలో ఉన్నారు. వీరిలో 5 జీ ఫోన్లు ఉన్నవారిలో చాలా మంది 2023లో 5 జీ సర్వీసులకు అప్గ్రేడ్ చేసుకుంటారని గ్లోబల్ టెలికం జెయింట్ ఎరిక్సన్ చెబుతోంది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) సందర్భంగా ఇటీవలే దేశంలో 5 జీ సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 5 జీ ఎక్విప్మెంట్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తమ తయారీ సామర్ధ్యాన్ని కూడా పెంచుకుంటున్నట్లు పేర్కొంది. నెట్వర్క్ల కోసం అవసరమయ్యే ఏఐఆర్ 3219, ఏఐఆర్ 3268 ఎక్విప్మెంట్ ఇందులో ఉన్నాయని వివరించింది. ఈ రేడియోలను ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్స్లో వినియోగిస్తారు. పుణెలో 4 జీ, 5 జీ ఎక్విప్మెంట్ తయారు చేసే తమ ప్లాంట్ కెపాసిటీని విస్తరిస్తున్నట్లు ఎరిక్సన్ వెల్లడించింది. కొత్తగా తయారు చేసే ఎక్విప్మెంట్ను అమర్చడం చాలా సులభంగా ఉంటుందని పేర్కొంది. మొబైల్స్లో క్లౌడ్ గేమింగ్ వేగంగా ఎదగనుందని చెబుతూ, ఇందుకోసం తాము తెచ్చిన నెట్వర్క్ స్లైసింగ్ ఫీచర్ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ ఫీచర్ను ఐఎంసీలో కంపెనీ ప్రదర్శించింది కూడా. మొబైల్ గేమర్లకు యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగ్గా ఉండేలా ఈ ఫీచర్ సాయపడుతుందని వివరించింది.
జియో, ఎయిర్టెల్ల నుంచి ఆర్డర్లు....
రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ల నుంచి 5 జీ నెట్వర్క్ ఎక్విప్మెంట్ కోసం ఆర్డర్లను చేజిక్కించుకున్నట్లు కూడా ఎరిక్సన్ వెల్లడించింది. ఈ రెండు టెలికం కంపెనీలూ ఎరిక్సన్ ఎక్విప్మెంట్నే వాడనున్నాయి. వీ (వోడాఫోన్ ఐడియా)తో కూడా ఎరిక్సన్ డిస్కషన్స్ జరుపుతున్నట్లు సమాచారం. ఇండియాలో 5 జీ రెడీ స్మార్ట్ఫోన్లు ఉన్న వారి సంఖ్య గత రెండేళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు ఎరిక్సన్ పేర్కొంది. అమెరికా, యూకేలలో కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువని వివరించింది. అర్బన్ కస్టమర్లకు మంచి ఎక్స్పీరియన్స్ కలిగించే 5 జీ టెక్నాలజీ, దేశం తన డిజిటల్ ఇన్క్లూజన్ గోల్స్ చేరుకోవడానికీ సాయపడుతుందని ఎరిక్సన్ నెట్వర్క్ సొల్యూషన్స్ హెడ్ నితిన్ బన్సల్ చెప్పారు.వచ్చే ఏడాదిలో 10 కోట్ల మంది 5 జీ నెట్వర్క్ వినియోగదారులవుతారని ఎరిక్సన్ రిపోర్టు అంచనా వేస్తోంది. మెరుగైన డేటా సర్వీసెస్ దొరికేటట్లయితే ఎక్కువ రేట్ల ప్లాన్లకు మారడానికి 5 కోట్ల మంది రెడీ అయినట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. ఇప్పుడు 4 జీ ప్యాక్స్ కోసం చెల్లించే మొత్తం కంటే దాదాపు 45 శాతం ప్రీమియం చెల్లించడానికి ఆ కస్టమర్లు సిద్ధమవుతున్నట్లు వివరించింది.
సర్వీస్ క్వాలిటీ ఇంపార్టెంట్....
ఏ సర్వీస్ ప్రొవైడర్ మెరుగైన 5 జీ సర్వీస్ ఇస్తే ఆ ప్రొవైడర్వైపు మళ్లేందుకు కస్టమర్లు సిద్ధంగా ఉన్నారని, మొబైల్ ఆపరేటర్లు ఈ విషయంలో జాగ్రత్త పడాలని ఎరిక్సన్ రిపోర్టు సూచించింది. 5 జీతో ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సర్వీసులూ రానున్నట్లు పేర్కొంది. వైర్డ్ హోమ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులకు ఆల్టర్నేటివ్గా దీనిని వాడొచ్చని తెలిపింది. జియో ఎయిర్ ఫైబర్ పేరిట ఇలాంటి సర్వీసులు తేనున్నట్లు రిలయన్స్ జియో ఇప్పటికే ప్రకటించింది.