అది కరోనా​మరణం కాదు.. హార్ట్​స్ట్రోక్​తోనే పేషంట్​ మృతి: నాగేందర్​

అది కరోనా​మరణం కాదు..  హార్ట్​స్ట్రోక్​తోనే పేషంట్​ మృతి: నాగేందర్​

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్​లో కరోనాతో ఓ వ్యక్తి మరణించాడంటూ మంగళవారం వచ్చిన వార్తలపై ఆ హాస్పిటల్​ సూపరింటెండెంట్​ డాక్టర్​ నాగేందర్ స్పందించారు. కరోనా​మరణం అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, చనిపోయిన వ్యక్తి మృతికి కారణం గుండె సంబంధిత సమస్యలేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత జేఎన్​–1 వేరియంట్ కు​ తేలికపాటి లక్షణాలు ఉంటాయని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. 

బండ్లగూడకు చెందిన మహమ్మద్​ సుభాన్​(60) ఈ నెల 14న గుండె, శ్వాస సంబంధిత సమస్యలతో ఉస్మానియా హాస్పిటల్​లో చేరాడు. చికిత్స కొనసాగుతుండగానే పరిస్థితి విషమించి ఈ నెల 24న మృతి చెందాడు. అనంతరం డెడ్​బాడీకి కరోనా​టెస్టు చేయడంతో పాజిటివ్​గా నిర్ధారణ అయింది. అయితే వరుస సెలవులు ఉండటంతో ఈ వార్త బయటకు రాలేదు. మంగళవారం సుభాన్​ ది కరోనా​మరణం అంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతో హాస్పిటల్​ లోని రోగులు, ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 

అయితే, ఈ ప్రచారాన్ని నమ్మొద్దని హాస్పిటల్​ సూపరింటెండెంట్​ నాగేందర్ ​స్పష్టం చేశారు. ఉస్మానియాలో ఎలాంటి కరోనా​మరణం సంభవించలేదని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ముగ్గురు కరోనా​బాధితులు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు.