
న్యూఢిల్లీ: ఫార్మల్ (వైట్ కాలర్) జాబ్స్ ఈ ఏడాది జూన్ క్వార్టర్ (క్యూ1) లో పెరిగాయని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ (ఎంఎస్పీఐ) ఓ రిపోర్ట్లో వెల్లడించింది. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐ, ఎన్పీఎస్ వంటి వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి డేటాను తీసుకొని ఈ రిపోర్ట్ను తయారు చేసింది. కరోనా సంక్షోభం తర్వాత ఎకానమీ వేగంగా రికవరీ అవుతుండడంతో ఫార్మల్ జాబ్ సెక్టార్లో కొత్త ఉద్యోగాలు పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది క్యూ1 లో ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) లో కొత్త సబ్స్క్రయిబర్లు 40.5 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగారని, జూన్లో 30.05 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగారని తెలిపింది.
ఫార్మల్ జాబ్ సెక్టార్లో ఉద్యోగులు తిరిగి జాయిన్ అవ్వడం ఈ ఏడాది జూన్ క్వార్టర్లో 51 శాతం పెరిగింది. జూన్ నెలలో 48.6 శాతం పెరిగింది. కొత్తగా ఈపీఎఫ్ఓకి సబ్స్క్రయిబ్ అయిన వాళ్లు, మళ్లీ ఉద్యోగాల్లో జాయిన్ వారిని కలిపి తీసుకుంటే ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో ఫార్మల్ ఉద్యోగులు నికరంగా 46 శాతం పెరిగారని, జూన్లో 39 శాతం పెరిగారని ఎంఎస్పీఐ రిపోర్ట్ వివరించింది. కాగా, రూ. 15 వేలు కంటే ఎక్కువ శాలరీ తీసుకున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ సబ్స్క్రిప్షన్ దక్కుతుంది. దీంతో దేశంలోని ఫార్మల్ జాబ్ సెక్టార్లో పరిస్థితులను ఈపీఎఫ్ఓ డేటా తెలియజేస్తుందని అంచనావేయొచ్చు.
హాస్పిటాలిటీ సెక్టార్ రికవరీ అవ్వడంతోనే..
హాస్పిటాలిటీ (ట్రావెల్, టూరిజం, హోటల్స్) సెక్టార్ పుంజుకుంటుండడంతో ఈ సెక్టార్లో కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే మానేసిన వారు తిరిగి జాయిన్ కావడం కూడా పెరుగుతోంది. ఫార్మల్ జాబ్ సెక్టార్లోని పరిస్థితులను మాత్రమే తాజాగా రిలీజ్ చేసిన రిపోర్ట్ తెలియజేస్తోందని, మొత్తం జాబ్ మార్కెట్ గురించి కాదని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ క్లారిఫై చేసింది. ఈపీఎఫ్ఓ సబ్స్క్రయిబర్ల నెంబర్ వివిధ సోర్స్ల నుంచి తీసుకున్నదని, డేటా ఓవర్ల్యాప్ అయ్యే అవకాశాల ఉన్నాయని తెలిపింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐ) కు కొత్తగా సబ్స్క్రయిబ్ అయిన వాళ్లు కూడా ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఏడాది ప్రాతిపదికన 45 శాతం పెరిగారని, జూన్లో 48 శాతం పెరిగారని ఎంఎస్పీఐ రిపోర్ట్ వెల్లడించింది.