- పెరుగుతున్న రాజీనామాలు
- ఐటీ, టెక్నాలజీ ట్యాలెంట్కు గిరాకీ
- స్కిల్స్ ఉన్న వారు దొరకట్లే!
- వెల్లడించిన మ్యాన్పవర్ సర్వే
న్యూఢిల్లీ: కరోనా రక్కసి లక్షలాది మంది నోటికాడి బువ్వను లాగేసుకున్నప్పటికీ, పరిస్థితులు ఇప్పుడు చక్కబడుతున్నాయి. కొత్త జాబ్స్ భారీగా వస్తున్నాయి. ఇండియాలో నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతున్నాయి. ‘గ్రేటర్ రిజిగ్నేషన్’ పేరుతో మ్యాన్పవర్ చేసిన ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. ఐటీ, టెక్నాలజీ సెక్టార్ కంపెనీలు ట్యాలెంట్ కోసం వెతుకుతున్నాయి. ఈ రెండు సెక్టార్లలో రాజీనామాలు చాలా ఎక్కువగా ఉండటమే ఈ పరిస్థితికి కారణం. ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఇండియాకు గ్లోబల్గా 43వ ర్యాంకు దక్కింది. అయితే స్కిల్స్ ఉన్న కేండిడేట్లు దొరకడం కష్టంగానే ఉందని మ్యాన్పవర్గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ చెప్పారు. జాబ్స్కు అవకాశాలు (హైరింగ్ ప్రాస్పెక్ట్స్) బాగున్న దేశాల్లో ఆస్ట్రేలియా (+37%) హాంకాంగ్ (+37%) ముందున్నాయి. అవకాశాలు తక్కువగా ఉన్న దేశాల లిస్టులో జపాన్ (+11%), తైవాన్ (+13%) సింగపూర్ (+14%) ఉన్నాయి. ఐటీ, టెక్నాలజీ, టెలికం, కమ్యూనికేషన్లు, మీడియా సెక్టార్లలో 60 శాతం వరకు హైరింగ్ ప్రాస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు 56 శాతం, బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా మరియు రియల్ ఎస్టేట్ సెక్టార్లలో 52 శాతం ఉన్నాయి. గత నవంబరుతో పోలిస్తే ఈ ఏడాది నవంబరులో రిటైల్ సెక్టార్లో జాబ్స్ 27 శాతం పెరిగాయని నౌకరీ డాట్కామ్ సర్వే రిపోర్టు తెలిపింది. ట్రావెల్, టెలికం సెక్టార్లలోనూ జాబ్స్ పెరిగాయని వెల్లడించింది. ఫెస్టివ్ సీజన్ కారణంగా హాస్పిటాలిటీ/ట్రావెల్ సెక్టార్లో 58 శాతం, టెలికం సెక్టార్లో 91 శాతం గ్రోత్ కనిపించిందని నౌకరీడాట్కామ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. 2020 నవంబరుతో పోలిస్తే ఈసారి నవంబరులో ఐటీలో 50 శాతం, బ్యాంకింగ్/ఫైనాన్షియల్ సర్వీసెస్లో 30 శాతం గ్రోత్ కనిపించిందని వివరించారు.