చెన్నై: ఒక కన్జూమర్కు రూ. లక్ష కాంపెన్సేషన్ చెల్లించాల్సిందిగా ఐటీసీ లిమిటెడ్ను కన్జూమర్ కోర్టు ఆదేశించింది. చెన్నైకి చెందిన పి డిల్లీబాబు అనే కన్జూమర్ ఐటీసీ లిమిటెడ్పై ఈ కేసు వేశారు. కన్జూమర్లను రోజుకు రూ. 30 లక్షల చొప్పున కంపెనీ మోసం చేస్తోందని డిల్లీబాబు తన పిటిషన్లో ఆరోపించారు. ఈ కేసు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేసుకు సంబంధించిన సంఘటన 2021 డిసెంబర్లో చోటు చేసుకుంది. మనాలి విజిట్ చేస్తున్న డిల్లీబాబు అక్కడి ఒక రిటెయిల్ స్టోర్లో రెండు డజన్ల సన్ఫీస్ట్ మేరీ లైట్బిస్కట్లను కొన్నారు. ఆ ప్యాకెట్లపై ముద్రించినది 16 బిస్కట్లయితే, ఓపెన్ చేసి చూస్తే ప్యాకెట్లో ఉన్నవి మాత్రం ఒకటి తక్కువ. ముందుగా ఆయన ఆ రిటెయిల్ స్టోర్ను, ఆ తర్వాత ఐటీసీ కంపెనీని వివరణ కోసం ఆశ్రయించారు.
కానీ, ఎలాంటి ప్రయోజనం కలగలేదు. దీంతో కన్జూమర్ కోర్టులో కేసు వేశారు. ఒక్కో బిస్కట్ ఖరీదు 75 పైసలని, రోజుకి ఐటీసీ లిమిటెడ్ 50 లక్షల బిస్కట్ ప్యాకెట్లను తయారు చేస్తోందని తన పిటిషనల్లో డిల్లీబాబు పేర్కొన్నారు. దీనిని బట్టి లెక్కిస్తే ఐటీసీ కంపెనీ తన కన్జూమర్లను రోజుకి రూ. 29 లక్షల మేర మోసగిస్తోందని ఆరోపించారు. అయితే, ఈ కేసులో తన వాదన వినిపించిన ఐటీసీ, ఆ ప్యాకెట్లను బరువు ప్రాతిపదికనే విక్రయిస్తున్నామని, బిస్కెట్ల సంఖ్యను బట్టి కాదని తెలిపింది.
ఈ కేసులో ఉదహరించిన బిస్కట్ ప్యాకెట్ బరువు 76 గ్రాములని కంపెనీ పేర్కొంది. కన్జూమర్ కోర్టు ఆ బిస్కెట్ ప్యాకెట్ల బరువు 74 గ్రాములే ఉన్నట్లు కనుగొంది. రూల్స్ ప్రకారం 4.5 గ్రాముల దాకా వ్యత్యాసం ఉన్నా పర్వాలేదని ప్రస్తావించింది. కానీ, ఈ వాదనను న్యాయమూర్తి అంగీకరించలేదు. ఆగస్టు 29 న ఈ కేసులో జడ్జి తన తీర్పు ఇచ్చారు. అమ్మకాలలో ఇలాంటి తప్పుడు పద్ధతులను పాటించొద్దని , కన్జూమర్కు రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించారు.