నాగ్పూర్: ఐదు నెలల తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోవడం చాలా ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇస్తున్నాయని ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. ఇది తనకు లభించిన గొప్ప వరంగా భావిస్తానన్నాడు. ‘నేను మళ్లీ ఇండియా జెర్సీని ధరిస్తున్నా. ఈ చాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ జెర్సీయే నాకు ప్రేరణ. అయితే ఇక్కడికి చేరుకునే ప్రయాణం చాలా హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఎందుకంటే ఐదు నెలలుగా నేను క్రికెట్కు దూరంగా ఉన్నా. అది చాలా నిరుత్సాహాన్ని కలిగించింది. వీలైనంత త్వరగా ఫిట్నెస్ సాధించి టీమ్లోకి రావాలని కోరుకున్నా’ అని జడేజా పేర్కొన్నాడు. మోకాలి సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలనే విషయంలో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్పాడు.
వరల్డ్కప్కు ముందా, తర్వాత అనేది డిసైడ్ చేసుకోలేకపోయానన్నాడు. ‘గాయంతో వరల్డ్కప్లో ఆడే చాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని తెలుసు. కానీ అందుబాటులో ఉంటే టీమ్కు మేలు జరుగుతుందనే ఆలోచన నన్ను వెంటాడింది. దీంతో గాయం తీవ్రతపై డాక్టర్లతో చర్చించా. ఆడే చాన్సెస్ తక్కువ కాబట్టి వరల్డ్కప్కు ముందే సర్జరీ చేయించుకోవడం బెటర్ అని డాక్టర్లు చెప్పారు. అందుకు తగినట్లుగా నా మైండ్సెట్ను మార్చుకున్నా. కానీ పోస్ట్ సర్జరీ నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. సెలవుల్లో కూడా ఫిజియోలు నాకోసం పని చేశారు. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చాలా అండగా నిలిచారు. ఎన్సీఏలో ట్రెయినింగ్ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని జడ్డూ వ్యాఖ్యానించాడు.