
- వరికి ప్రత్యామ్నాయంగా సాగుచేసేందుకు రైతుల ఆసక్తి
- జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది సాగు లక్ష్యం 3,750 ఎకరాలు
- ప్రస్తుతం 1,710 ఎకరాల్లో సాగు
- రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఏటా ఆయిల్పామ్ సాగు పెరుగుతోంది. మార్కెట్లో డిమాండ్ ఉండడంతో వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్పామ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆయిల్పామ్ తోటలు పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాయి. దీంతో పాటు జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అనువైన వాతావరణం ఉండడంతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆయిల్పామ్ పంటకు డిమాండ్ ఉండడంతో ధర పలుకుతుందని, దీంతోపాటు అంతర పంటలతో లాభాలు ఆర్జించొచ్చని రైతులకు వివరిస్తున్నారు.
3,750 ఎకరాల్లో సాగు ప్రణాళిక
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3,750 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1,710 ఎకరాల్లో సాగవుతోంది. ఈ ఏడాది సాగు లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యానశాఖ అధికారులు ప్రతి రోజు ఎంపిక చేసిన గ్రామాల్లో సాగుపై రైతులకు విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆయిల్పామ్కు డిమాండ్ ఉండడంతో తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తోంది. తొలి నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.4200 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తోంది.
ఈ సబ్సిడీని ఆయిల్పామ్తోపాటు అంతర పంటల యాజమాన్యం పద్ధతులకు(మెయింటెనెన్స్) ఇస్తుంది. నాలుగేళ్ల తర్వాత ఎకరాకు 6 టన్నుల చొప్పున దిగుబడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత గరిష్ఠంగా ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయిల్పామ్ గెలల రేటును కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుండగా.. ప్రస్తుతం టన్నుకు రూ. 21 వేలుగా
ఉంది.
సాగు లక్ష్యాన్ని చేరుకోవాలి
ఇప్పటి వరకు 1,710 ఎకరాల్లో గుర్తించాం. వీరందరూ దరఖాస్తు చేసుకోవడంతో రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. రైతులకు అంతర్ పంటకు, మెయింటనెన్స్ కోసం నాలుగేళ్లపాటు ఎకరానికి రూ. 4200 చొప్పున సబ్సిడీ వస్తోంది. పంట రావడం స్టార్టయ్యాక ఎకరానికి రూ.1లక్ష నుంచి రూ.2లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది.
జి.శ్యామ్ ప్రసాద్, హార్టిక్చలర్ ఆఫీసర్, జగిత్యాల