దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఒక్కో రాష్ట్రానికి స్ప్రెడ్ అవుతున్నాయి. కొత్తగా రాజస్థాన్‌లో ఇవాళ 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. సౌతాఫ్రికా నుంచి ఆ రాష్ట్ర రాజధాని జైపూర్‌‌కు వచ్చిన వారికి ఈ వేరియంట్ సోకింది. కరోనా పాజిటివ్ వచ్చిన వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్ అని తేలిందని, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు సంఖ్య 21కి పెరిగింది. ఇవాళ మధ్యాహ్నం వరకూ ఐదు కేసులకు పరిమితమైన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు.. సాయంత్రం ఒక్కసారిగా పెరిగాయి. మనకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలో ఒకే కేసు ఉండగా.. ఈ రోజు కొత్తగా మరో ఏడు ఒమిక్రాన్ కేసులు వచ్చాయి.

ఇక ఢిల్లీ, గుజరాత్ లో ఒక్కో కేసు నమోదు కాగా.. కర్ణాటకలో రెండు కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారికి విస్తృత పరీక్షలు నిర్వహించి.. పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు. ఒమిక్రాన్ కేసులు అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.