
- బీసీల సంఘాల మీటింగ్ లో జాజుల శ్రీనివాస్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్ లో చేర్చి వెంటనే ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అప్పుడే కేంద్రాన్ని బీసీలు విశ్వసిస్తారని అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతికి పంపి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ స్పందన లేదన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి పెంచాలని ఆయన కోరారు.
బీసీ రిజర్వేషన్లను సాధించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కళింగ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది . ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షత వహించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్ల పెంపు కోసం సీఎం అఖిలపక్షంతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు.
స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలను రాజకీయంగా చైతన్యం చేయడానికి జూన్, జులైలో రాష్ట్రంలోని 33 జిల్లాలు పర్యటిస్తామన్నారు. బీసీలు రాయితీలతో రాజీపడకుండా రాజకీయ అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీసీలకు అధికారం దక్కేలా బీసీలందరూ కృషి చేయాలని, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సీఎం అయ్యేలా పనిచేయాలని జాజుల సూచించారు. కాగా.. ఈ మీటింగ్ లో 10 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.