ఒకప్పుడు లావెండర్ తోటలు చూడాలంటే విదేశాలకు వెళ్లాల్సిందే. కానీ, ఇప్పుడు జమ్మూకాశ్మీర్లోనే అందంగా విరబూసిన లావెండర్ తోటలు చూడొచ్చు. వరి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలకు బదులుగా కొందరు రైతులు లావెండర్ తోటలు పెంచుతున్నారు. కుంకుమపువ్వుతో పాటు, ఇప్పుడు లావెండర్ తోటలు కూడా కాశ్మీర్కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నాయి. చల్లటి వాతావరణం కలిగిన జమ్మూకాశ్మీర్లో దేశంలోనే కొన్ని అరుదైన పంటలు పండుతుంటాయి. కుంకుమపువ్వు, మిల్లెట్స్, చెర్రీస్, పియర్స్, బాదం, వాల్నట్స్ వంటివి ఎక్కువగా పండుతాయి. వీటితోపాటు సంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్న కూడా ఎక్కువగానే పండిస్తారు. అయితే, ఇప్పుడు కొందరు రైతులు వీటికి భిన్నంగా లావెండర్ మొక్కల్ని పెంచుతున్నారు. జమ్మూకాశ్మీర్లో రాష్ట్రంలోని దోడా జిల్లాలో దాదాపు రెండు వందలమంది రైతులు లావెండర్ తోటలు పెంచుతున్నారు. వందల ఎకరాల్లో ఉన్న ఈ లావెండర్ తోటలు కశ్మీరీలతోపాటు పర్యాటకుల్ని కూడా ఆకట్టుకుంటున్నాయి.
విదేశీ మొక్కలు
లావెండర్ ఎక్కువగా యూరప్లోనే పెరుగుతాయి. ఎక్కువ ఎండను తట్టుకోలేవు. అందుకే మన దగ్గర ఉండే వేడి వాతావరణంలో ఎక్కువగా పెరగవు. అయితే, దేశం మొత్తమ్మీద కాశ్మీర్ వీటికి అనుకూలంగా ఉంటుంది. అందుకే అక్కడి అధికారులు, 2018 నుంచి లావెండర్ తోటల్ని పెంచేలా రైతుల్లో మార్పు తెస్తున్నారు. దోడా జిల్లాతోపాటు కిష్ట్వార్, రాజౌరి జిల్లాల్లో లావెండర్ తోటలు ఎక్కువగా పెంచుతున్నారు. దీంతో ఈ జిల్లాల్లో ఇప్పుడు ఎటు చూసినా పర్పుల్ (ఊదా) కలర్లో లావెండర్ తోటలు కనిపిస్తున్నాయి. దేశంలో ‘అరోమా అండ్ ఫార్మాసూటికల్ మిషన్–2016’లో భాగంగా, అరోమాటిక్ మొక్కల్ని ఎక్కువగా పెంచాలనుకున్నారు. దీనిలో భాగంగానే లావెండర్ను పెంచుతున్నారు. లావెండర్తోపాటు రోస్మేరీ, మింట్, లెమన్ గ్రాస్ వంటి మొక్కల్ని కూడా పెంచుతున్నారు.
లాభం ఏంటంటే...
లావెండర్ మొక్కలకు విదేశీ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. వీటిని బ్యూటీ, హెల్త్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా వాడుతారు. లావెండర్ ఆకులు, గింజల నుంచి రకరకాల సెంట్లు, ఆయిల్స్ తయారుచేస్తారు. ఎయిర్ఫ్రెష్నర్స్గా వాడతారు. మసాజ్ థెరపీ, స్కిన్ కేర్, హెయిర్ కేర్ వంటివాటిలో లావెండర్ ప్రొడక్ట్స్ వాడతారు. ఇన్సోమ్నియా, మజిల్ పెయిన్, డిప్రెషన్ వంటి సమస్యల ట్రీట్మెంట్లో కూడా వాడతారు.