హైదరాబాద్, వెలుగు: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని సర్వే నెంబర్ 130లోని భూమి విషయంలో జమునా హేచరీస్ హైకోర్టుకు వెళ్లింది. జమునా హేచరీస్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున, ఆయన కొడుకు నితిన్ రెడ్డి రిట్లు ఫైల్ చేశారు. ఈ ఏడాది మే 6, జూన్ 25న మాసాయిపేట్ ఎమ్మార్వో ఇచ్చిన నోటీసులను కొట్టేయాలని కోరారు. వీటిపై జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదించారు. ‘‘సర్వే నెంబర్ 130లోని భూమిని నితిన్రెడ్డి కొనుగోలు చేశారు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అందులోని 18.35 ఎకరాల వ్యవహారంలో జాయింట్ కలెక్టర్ 2017లో విచారణ చేపట్టి, మూడెకరాల్ని కె.సత్యనారాయణరావు పేరుతో రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఆర్డర్ను 2018లో మాసాయిపేట ఎమ్మార్వో అమలు చేశారు. ఆ తర్వాతే సత్యనారాయణరావు నుంచి నితిన్రెడ్డి భూమిని కొన్నారు” అని వివరించారు. ఏ భూమి ఎవరిదో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని, ఈ క్రమంలోనే పిటిషనర్లకు నోటీసులు జారీ చేసిందన్నారు. రాజకీయంగా విభేదాలు రావడంతో కక్షగట్టి నోటీసులు ఇస్తున్నారని, ఇప్పటి వరకు ఏకంగా 72 నోటీసులు జారీ చేశారని చెప్పారు.
అదంతా ప్రభుత్వ భూమే: ప్రభుత్వ లాయర్
ప్రకాశ్ రెడ్డి వాదనలను గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్ హరీందర్ వ్యతిరేకించారు. సత్యనారాయణరావు నుంచి కొన్న మూడెకరాల ప్రొసీడింగ్స్ను సవాల్ చేయకుండా, మొత్తం అన్ని ప్రొసీడింగ్స్ను ఎలా సవాల్ చేస్తారని ప్రశ్నించారు. ఆ సర్వే నెంబర్ లోని ల్యాండ్ పూర్తిగా ప్రభుత్వానిదేనని, 1995లో ల్యాండ్ సీలింగ్ ప్రొసీడింగ్ జారీ చేసి సర్కార్ స్వాధీనం చేసుకుందని గుర్తు చేశారు. అసైన్డ్ భూమిని ఎవరు కొనుగోలు చేసినా అది చెల్లుబాటు కాదన్నారు. వాదనలు కోర్టు.. తీర్పును వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.