యువకుడిని ఎత్తుకెళ్లి బంగారు గొలుసు దోపిడీ.. జనగామ రైల్వే స్టేషన్ లో ఘటన

యువకుడిని ఎత్తుకెళ్లి బంగారు గొలుసు దోపిడీ.. జనగామ రైల్వే స్టేషన్ లో ఘటన
  •   రైలు కోసం ఎదురుచూస్తుండగా లాక్కెళ్లిన దుండగులు
  •     కారులో దాడి చేసి డబ్బులు డిమాండ్

జనగామ అర్బన్​, వెలుగు: ట్రైన్​ కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడిని దుండగులు కిడ్నాప్​ చేసి అతడి వద్ద బంగారం, మొబైల్​ దోచుకున్నారు. సదరు యువకుడిని చితకబాది హైవే పక్కన వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడు తెలిపిన ప్రకారం.. 

జనగామ పట్టణంలోని ప్రిస్టన్​ ఏరియాకు చెందిన కొమిరె కార్తికేయ(19) ఏపీలోని విజయవాడలో బీటెక్​ ఫస్టియర్​ చదువుతున్నాడు. ఉగాది పండుగకు ఇంటికి వచ్చాడు. తిరిగి విజయవాడకు వెళ్లేందుకు బుధవారం సాయంత్రం జనగామ రైల్వేస్టేషన్​కు వెళ్లాడు. తాను ఎక్కాల్సిన శాతవాహన రైలు మిస్​ కావడంతో పద్మావతి రైలు కోసం రెండో ప్లాట్​ఫాంపై ఎదురుచూస్తున్నాడు. అతడి దగ్గరికి నలుగురు యువకులు వచ్చి మత్తు మందు ప్రయోగించారు. 

కారులో ఎక్కించుకుని హన్మకొండ‌‌‌‌‌‌‌‌–హైదరాబాద్​ హైవేపైకి వచ్చారు. హైదరాబాద్​ వైపు వెళ్తుండగా కళ్లెం గ్రామ సమీపంలో యువకుడికి స్పృహ వచ్చింది. మెడలో ఉన్న తులం బంగారు గొలుసుతో పాటు స్మార్ట్​ఫోన్​ లాక్కున్నారు. ఆ తరువాత యువకుడిని హైవే పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుడు జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.