డిప్యూటీ స్పీకర్​గా రామచంద్రునాయక్​ .. గిరిజన బిడ్డకు దక్కిన గౌరవం

డిప్యూటీ స్పీకర్​గా రామచంద్రునాయక్​ .. గిరిజన బిడ్డకు దక్కిన గౌరవం
  • పదవి దక్కడంతో శ్రేణుల్లో హర్షం 
  • ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఇప్పటికే రెండు మంత్రి పదవులు
  • జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా : రామచంద్రునాయక్​

మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్​ జిల్లాకు మరో పదవి దక్కింది. ఇప్పటికే జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ, అటవీ శాఖల మంత్రిగా కొండా సురేఖ క్యాబినేట్​లో ఉన్నారు. తాజాగా, మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ జాటోతు రామచంద్రునాయక్​ను రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​గా సీఎం రేవంత్​రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఉమ్మడి జిల్లాకు పదవులు దక్కడంపై కాంగ్రెస్​ శ్రేణుల్లో హర్షం 
వ్యక్తమవుతోంది.

రామచంద్రునాయక్​ ప్రస్థానం..

గిరిజన లంబాడ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రునాయక్​ 1974 మే 6న మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్ శివారు రెడ్డికుంట తండాలో జాటోతు రాములు నాయక్​మారోణిబాయికి జన్మించారు. 1998లో ఎంబీబీఎస్​ పూర్తి చేసి, 2001లో ఉస్మానియా మెడికల్​ కాలేజీలో ఎంఎస్​ (జనరల్) పూర్తి చేశారు. భార్య డాక్టర్​ ప్రమీల, పిల్లలు శివ తరుణ్, శివ సాకేత్​ ఉన్నారు. ఆయన 2006లో టీడీపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో టీడీపీ డోర్నకల్​ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కాంగ్రెస్​లో చేరారు. 2019లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోగా, 2023లో సమీప బీఆర్​ఎస్​ అభ్యర్థి రెడ్యానాయక్​పై 53,131 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదే ఏడాది డిసెంబర్​ 15న రాష్ర్ట ప్రభుత్వ విప్​గా నియామకమయ్యారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్​ పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తొలుత మంత్రి పదవి దక్కుతుందని భావించినా డిప్యూటీ స్పీకర్​ పదవిని కేటాయించారు. 

డోర్నకల్ ​ప్రజలకు రుణపడి ఉంటా

డోర్నకల్​ ప్రజలు ఇచ్చిన రాజకీయ అవకాశంతో సీఎం రేవంత్​రెడ్డి చొరవతో రాష్ట్ర అసెంబ్లీ  డిప్యూటీ స్పీకర్​ పదవి దక్కింది. లంబాడ సామాజిక వర్గానికి చెందిన నాకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. మహబూబాబాద్​ జిల్లా అభివృద్ది కోసం మరింతగా కృషి చేస్తా. పదవి రావడానికి సహకరించి పార్టీ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు.

జాటోతు రామచంద్రు నాయక్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​