
- పదవి దక్కడంతో శ్రేణుల్లో హర్షం
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే రెండు మంత్రి పదవులు
- జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా : రామచంద్రునాయక్
మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో పదవి దక్కింది. ఇప్పటికే జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ, అటవీ శాఖల మంత్రిగా కొండా సురేఖ క్యాబినేట్లో ఉన్నారు. తాజాగా, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోతు రామచంద్రునాయక్ను రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఉమ్మడి జిల్లాకు పదవులు దక్కడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం
వ్యక్తమవుతోంది.
రామచంద్రునాయక్ ప్రస్థానం..
గిరిజన లంబాడ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రునాయక్ 1974 మే 6న మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్ శివారు రెడ్డికుంట తండాలో జాటోతు రాములు నాయక్మారోణిబాయికి జన్మించారు. 1998లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, 2001లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంఎస్ (జనరల్) పూర్తి చేశారు. భార్య డాక్టర్ ప్రమీల, పిల్లలు శివ తరుణ్, శివ సాకేత్ ఉన్నారు. ఆయన 2006లో టీడీపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో టీడీపీ డోర్నకల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కాంగ్రెస్లో చేరారు. 2019లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోగా, 2023లో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్పై 53,131 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదే ఏడాది డిసెంబర్ 15న రాష్ర్ట ప్రభుత్వ విప్గా నియామకమయ్యారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తొలుత మంత్రి పదవి దక్కుతుందని భావించినా డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించారు.
డోర్నకల్ ప్రజలకు రుణపడి ఉంటా
డోర్నకల్ ప్రజలు ఇచ్చిన రాజకీయ అవకాశంతో సీఎం రేవంత్రెడ్డి చొరవతో రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. లంబాడ సామాజిక వర్గానికి చెందిన నాకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా అభివృద్ది కోసం మరింతగా కృషి చేస్తా. పదవి రావడానికి సహకరించి పార్టీ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
జాటోతు రామచంద్రు నాయక్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్