- మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై దేవెగౌడ సూచన
మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్తో కలిసి సర్కారును నడిపి భంగపడిన జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని దేవె గౌడ స్పందించారు. పాత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కుమారస్వామిని మధ్యలో సీఎం పదవి నుంచి దించేసిన తరహాలో చేయొద్దంటూ కాంగ్రెస్ పార్టీకి సూచించారు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని ఐదేళ్లూ కొనసాగనిచ్చేట్లయితేనే మద్దతివ్వండి అని చెప్పారు దేవె గౌడ. మధ్యలో ఆ ప్రభుత్వాన్ని చికాకుపెట్టొద్దని సూచించారు. అలా చేస్తేనే కాంగ్రెస్ను ప్రజలు మళ్లీ నమ్మే పరిస్థితి వస్తుందని చెప్పారాయన.
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీకి తొలి అవకాశం ఇచ్చారు ఆ రాష్ట్ర గవర్నర్. 50:50 ఫార్ములాకు శివసేన పట్టుబట్టడంతో దానికి ఇష్టంలేని బీజేపీ తమ పొత్తును బ్రేక్ చేసుకుంది. తాము సర్కారును నెలకొల్పలేమంటూ బీజేపీ చేతులెత్తయడంతో రెండో పెద్ద పార్టీ అయిన శివసేనకు గవర్నర్ ఆఫీస్ నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.