తెలంగాణ పథకాలు దేశమంతా అమలుకావాలి

తెలంగాణ పథకాలు దేశమంతా అమలుకావాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని జనతాదళ్ (ఎస్) నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి అన్నారు. - దేశమంతా ఇలాంటి పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘‘ కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు.. బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన అనంతరం సర్వసభ్య సమావేశంలో కుమారస్వామి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ పార్టీ ఆవిర్భవించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా తమిళనాడుకు చెందిన విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ అధ్యక్షుడు తొల్కప్పియన్ తిరుమవలవన్ మాట్లాడుతూ..  కాంగ్రెస్ ను కూడా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కలుపుకుపోవాలని కోరారు. 

నాకు రాజకీయం ఒక టాస్క్

అంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి ఫోకస్ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై ఉంటుందని స్పష్టం చేశారు. అక్కడి రైతులకు మేలు జరిగేలా ముందుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘నేను దేశంలోని అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీని మీ రాష్ట్రానికి పరిమితం చేస్తే ఎలా ? అని చాలామంది అడిగారు. అందుకే  దేశ ప్రజల కోసం బీఆర్ఎస్ ను ప్రకటించాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయింది. నాకు రాజకీయం ఒక టాస్క్’’ అని తెలిపారు.  రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకుపోతామని వెల్లడించారు. ‘‘ దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎంతో ఆహార భద్రత ఉన్న మన దేశం ఇంకా ప్రాసెసింగ్ ఫుడ్ పైన ఆధారపడం సిగ్గుచేటు. విదేశాల నుంచి ప్రాసెసింగ్ ఫుడ్ ను దిగుమతి చేసుకోవడం దారుణం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.